Oil Palm | ఖైరతాబాద్, మే 31: అయిల్ ఫామ్ రైతులకు సరఫరా అవుతున్న నకిలీ విత్తనాలను అరికట్టాలని తెలంగాణ ఆయిల్ ఫెడ్ అశ్వారావుపేట జోన్ ఆయిల్ పామ్ గ్రోవర్స్ సొసైటీ అధ్యక్షులు తుంబూరు ఉమామహేశ్వర్ రెడ్డి కోరారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో సుమారు 2.10లక్ష ఎకరాల్లో 44వేల మంది రైతులు ఆయిల్ ఫామ్ పంటను సాగుచేస్తున్నారన్నారు.
ఆయిల్ ఫామ్ పంట వేసి నష్టపోతే పరిహారం అందించేందుకు సరైన చట్టాలు లేవన్నారు. విత్తనాల చట్టం కోసం ప్రభుత్వం కమిటీ వేసిందని, జూలైలో విత్తన చట్టాన్ని తీసుకువస్తుందని ఆ చట్టం పరిధిలో నష్టపోయిన ఆయిల్ ఫామ్ రైతులను తీసుకురావాలన్నారు. ఆయిల్ ఫెడ్ ప్రైవేటీకరణకు కుట్ర జరుగుతుందని, అత్యంత రాబడి ఉన్న రంగమైన దీనిని కొందరు కావాలనే అప్పుల ఊబిలో కూరుకుపోయేలా చేస్తున్నారన్నారు. ఆయిల్ ఫెడ్లో అనేక అక్రమాలు జరుగుతున్నాయని, వాటిపై విచారణ జరిపించాలన్నారు. అలాగే ప్రైవేట్ కాంట్రాక్టర్ల వ్యవస్థను తెలంగాణ ఆయిల్ ఫెడ్ నర్సరీల నుంచి తొలగించాలన్నారు. ఆయిల్ ఫామ్ బలోపేతానికి ప్రత్యేక బోర్డును ఏర్పాటు చేయలన్నారు. ఈ సమావేశంలో దామోదర్ రెడ్డి, రవికుమార్, జగ్గారావు, శ్రీరాములు, మురళీ, సురేశ్, సూర్యారావు తదితరులు పాల్గొన్నారు.