సిటీబ్యూరో, ఫిబ్రవరి 27 (నమస్తే తెలంగాణ): ఐపీఎస్, ఐఏఎస్, ఎంపీ, ఎమ్మెల్యే, డాక్టర్లు.. ఇతర ప్రముఖుల పేర్లు, ఫొటోలతో సోషల్మీడియా నకిలీ ఖాతాలు క్రియేట్ చేసి, మోసాలకు పాల్పడుతున్న ఘరానా ఛీటర్ను సీసీఎస్ సైబర్క్రైమ్ పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. అదనపు సీపీ ఏవీ రంగనాథ్ కథనం ప్రకారం..రాజస్థాన్, అల్వార్ జిల్లాకు చెందిన 22 ఏండ్ల నిందితుడు ఇంటర్నెట్లో ప్రముఖుల ఫొటోలను సేకరించి, డీపీగా పెట్టి ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో కొత్త ఖాతా లు క్రియేట్ చేస్తున్నాడు. అలాగే, కొత్త నంబర్తో వాట్సాప్లో వారి డీపీని కూడా పెడుతారు. ఇలా ఏసీబీ డీజీ, సీవీ ఆనంద్ పేరుతో ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ ఖాతా లు క్రియేట్ చేసిన నిందితుడు.. పలువురికి అత్యవసరంగా డబ్బులు కావాలని,ఇతర మెసేజ్లు పంపించాడు. ఈ విషయాన్ని గుర్తించిన సీవీ ఆనంద్ వెంటనే సైబర్క్రైమ్ పోలీసులను అప్రమత్తం చేయడంతో కేసు నమోదు చేశారు. ఏసీపీ చాంద్ భాషా నేతృత్వంలో ఇన్స్పెక్టర్ సైదులు బృందం దర్యాప్తు చేపట్టింది. ఈ దర్యాప్తులో ఈ నకిలీ ఖాతాలన్ని రాజస్థాన్ నుంచి క్రియేట్ అయినట్లు గుర్తించి, సీసీఎస్ పోలీసుల ప్రత్యేక బృందం నిందితుడిని అరెస్ట్ చేసి, నగరానికి తరలించారు. కాగా, కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకొని.. ఎంత మందిని మోసం చేశాడనే విషయంపై ఆరా తీస్తామని పోలీసు అధికారులు వెల్లడించారు.