చార్మినార్, ఫిబవ్రరి 28 : ఉన్నత చదువుల కోసం విదేశాలకు పంపిస్తామని, విదేశాల్లోని పేరొందిన యూనివర్సిటీలో సీట్లు ఇప్పిస్తామని అమాయకులను నమ్మిస్తూ అందినకాడికి దోచుకుంటున్న ముఠాను టాస్క్పోర్స్ పోలీసులు పట్టుకున్నారు. మంగళవారం పురాణిహవేలీలోని టాస్క్పోర్స్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో అడిషనల్ డీసీపీ గుమ్మి చక్రవర్తి వివరాలు వెల్లడించారు. నాంపల్లి బజార్ఘాట్ ప్రాంతానికి చెందిన మహ్మద్ హబీబ్ (32) రాయల్ కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్లో బీటెక్ పూర్తిచేశాడు. టోలిచౌకిలోని రిలయన్స్ అకాడమి కన్సల్టెన్సీలో అడ్మినిస్ట్రేటీవ్గా చేరాడు. అదే సమయంలో ఢిల్లీకి చెందిన సునీల్ కపూర్తో స్నేహం ఏర్పడింది. సులభంగా డబ్బులు సంపాదించాలని ఇద్దరు కలిసి పథకం వేశారు.
జైలుకు వెళ్లి వచ్చాక పెరిగిన ముఠా
2015లో మలక్పేట ప్రాంతంలో ైప్లె అబ్రాడ్ కన్సల్టెన్సీ కార్యాలయాన్ని ప్రారంభించారు. సునీల్కపూర్ సహకారంతో నకిలీ విద్యార్హత పత్రాలను తయారు చేస్తూ అమాయకులను బురిడీ కొట్టిస్తూ అక్రమ సంపాదనకు తెరతీశారు. అయితే వారు ఇచ్చిన సర్టిఫికెట్లు నకిలీవని గుర్తించిన పలువురు బాధితులు బహదూర్పుర, సరూర్నగర్ పోలీస్స్టేషన్లో గతంలోనే ఫిర్యాదు చేయడంతో నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. జైలు నుంచి బయటకు వచ్చిన నిందితులు తమ ముఠాలో ఇతర సభ్యులను చేర్చుకుని అబిడ్స్లో రావూఫ్ ఎడ్యుకేషనల్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ పేరుతో తిరిగి కార్యాలయాన్ని ప్రారంభించారు.
మోసాలకోసం ఏజెంట్లు
అమాయకులను గుర్తించేందుకు నిందితులు ఇర్ఫాన్ (28), షానవాజ్ ఖాన్ (29), మహ్మద్ జుబైర్ (34) సల్మాన్ఖాన్ (29) మహ్మద్ అబ్దుల్ సత్తార్ (33)లను ఏజెంట్లుగా నియమించుకున్నారు. విదేశాలకు వెళ్లడానికి ప్రయత్నించే వారిని గుర్తిస్తూ వారికి సహాయం చేస్తామంటూ నమ్మించే వారు. విదేశాలకు వెళ్లడానికి ఫలానా సర్టిఫికెట్ కావాలి.. మాకు తెలిసిన సార్ ఉన్నారని అతను మీకు సహాయం చేస్తాడని బాధితులను నమ్మించి ఫ్లై అబ్రాడ్ కార్యాలయానికి తీసుకువచ్చే వారు. నిందితుల మాటలను నమ్మిన బాధితులకు నకిలీ ధ్రువపత్రాలు అందిస్తూ అమెరికా, యూరప్ దేశాల్లో కోర్సులకు మంచి డిమాండ్ ఉందంటూ ఆశలు కల్పించి భారీ మొత్తాల్లో దోచుకునేవారు.
నకిలీ ధ్రువీకరణ పత్రాలు స్వాధీనం
నిందితుల వ్యవహారంపై విశ్వసనీయ సమాచారం అందుకున్న టాస్క్పోర్స్ పోలీసులు మహ్మద్ హబీబ్ను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద నుంచి దేశంలోని వివిధ రాష్ర్టాల్లోని విశ్వవిద్యాలయాలతోపాటు తెలంగాణ యూనివర్సిటీ, ఇతర ప్రైవేట్ యూనివర్సిటీల పేర్లతో ఉన్న రబ్బర్స్టాంపులు, అప్పటికే తయారు చేసి అమాయకులకు అందించడానికి సిద్ధంగా ఉన్న నకిలీ ధ్రువీకరణ పత్రాలను, 4 ల్యాప్ట్యాపులతోపాటు 11 సెల్ఫోన్లు, 20వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు తదుపరి విచారణ నిమిత్తం చాదర్ఘాట్ పోలీసులకు అప్పగించారు. ఈ దాడుల్లో ఇన్స్పెక్టర్ రాఘవేంద్ర, ఎస్సైలు షేక్ బురాన్, శ్రీశైలం, నరేందర్, నర్సింహులు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.