బంజారాహిల్స్,ఆగస్టు 3: పూజలు చేస్తే మంచి రోజులు వస్తాయంటూ మహిళను నమ్మించి ఆభరణాలతో ఉడాయించిన నకిలీ పూజారిపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. బంజారాహిల్స్ రోడ్ నంబర్- 14లో నివాసముంటున్న గుడిబండ రేణుక ఇంటి వద్దకు గతనెల 31న గుర్తుతెలియని వ్యక్తి వచ్చాడు. ఇంటిముందు ఉన్న మామిడి చెట్టు ఆకులు తెంపుకుంటానని అడిగాడు. తాను మాజీ కార్పొరేటర్ భారతీ నాయక్ ఇంటిముందు ఉన్న అమ్మవారి ఆలయంలో పూజారినంటూ పరిచయం చేసుకున్నాడు. మామిడి ఆకులు తీసుకున్న తర్వాత త్వరలో నీకు మంచి రోజులు రానున్నాయన్నారు.
అమ్మవారి వద్ద ఆభరణాలు పెట్టి పూజ చేస్తే అద్బుతమైన ఫలితాలు ఉంటాయంటూ నమ్మబలికాడు. దీంతో రేణుక తన వద్దనున్న మూడు తులాల బంగారు గొలుసు, 17తులాల వెండి నగలు అతడికి ఇచ్చింది. పూజ పేరుతో పూజారి ఆ నగలు తీసుకువెళ్లాడు. పూజ ముగిసిన తర్వాత ఆభరణాలు తిరిగి ఇస్తానంటూ చెప్పి, ఫోన్ నంబర్ కూడా ఇచ్చి వెళ్లిపోయాడు. అయితే, సాయంత్రం ఫోన్ చేయగా సరైన సమాధానం ఇవ్వకపోవడంతో అమ్మవారి ఆలయం వద్దకు వెళ్లి వాకబు చేయగా అక్కడ ఎవరూ పూజారి లేరని తేలింది. దీంతో అతడి కోసం అన్ని ప్రాంతాల్లో ఆరా తీసినా లాభం లేకపోవడంతో సోమవారం రాత్రి బాధితురాలు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోయినసొత్తు విలువ సుమారు రూ.2.9 లక్షలు ఉంటుందని ఫిర్యాదులో పేర్కొన్నారు.