ఫేస్బుక్ స్నేహం..ఓ మహిళను రూ. 5.3 లక్షలు ముంచేసింది. హిమాయత్నగర్కు చెందిన ఓ మహిళకు ఇంగ్లాండ్లో పనిచేస్తున్నానంటూ గుర్తుతెలియని వ్యక్తి (సైబర్ నేరగాడు) ఫేస్బుక్లో పరిచయం అయ్యాడు. ఇద్దరు కొన్నాళ్లు స్నేహంగా మాట్లాడుకున్నారు. మన స్నేహానికి గుర్తుగా మీకు విలువైన బహుమతి పంపిస్తున్నానంటూ నమ్మించాడు. రెండు రోజుల్లోనే ఆమెకు ఢిల్లీ ఎయిర్పోర్టు నుంచి కస్టమ్స్ అధికారులమంటూ ఫోన్ వచ్చింది. మీ పేరుతో విలువైన వస్తువుల పార్సిల్ వచ్చింది, దానికి కస్టమ్స్ క్లియరెన్స్ లేదు, వెంటనే కొంత డబ్బు చెల్లించాలంటూ సూచించారు. వాళ్లు చెప్పేది నిజమని నమ్మిన ఆమె.. వారు అడిగినట్లు డబ్బు చెల్లిస్తూ పోయింది. కస్టమ్స్, జీఎస్టీ, యాంటీ టెర్రరిస్ట్ పేర్లతో ఆమె వద్ద నుంచి రూ. 5.3 లక్షలు వసూలు చేశారు. ఇంకా డబ్బు అడుగుతుండటంతో ఇదంతా మోసమని గుర్తించిన బాధితురాలు సోమవారం సీసీఎస్ సైబర్క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది.