సిటీబ్యూరో, మార్చి 29 (నమస్తే తెలంగాణ): సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులపై పోలీసులు జులూం ప్రదర్శించారు. అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్బాబు హెచ్సీయూ విద్యార్థులపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా స్టూడెంట్స్ యూనియన్ శనివారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనాన్ని అడ్డుకుని దాడి చేశారు. యూనివర్సిటీ గేటు ముందు నుంచి విద్యార్థులను లోపలికి నెట్టుకెళ్లారు. అడ్డుకున్న విద్యార్థులపై పోలీసులు దాడికి తెగబడటంతో కొందరు కింద పడి స్పృహ తప్పి పడిపోయారు. మరికొందరు విద్యార్థులు గాయపడ్డారు.
ఆగ్రహించిన విద్యార్థులు ‘పోలీస్ గో బ్యాక్’ నినాదాలతో హోరెత్తించారు. దీంతో కాసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ… ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి రాష్ర్టాన్ని దివాళా తీయడమే కాకుండా, దివాళా లోటును పూడ్చుకోవడానికి హెచ్సీ యూ భూములపై కన్నేశారని ఆరోపించారు. 400 ఎకరాల భూములను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తంచే శారు.
ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న రేవంత్ రెడ్డి విద్యార్థులను గుంట నక్కలుగా అభివర్ణించడాన్ని తీవ్రంగా ఖండించారు. రేవంత్ రెడ్డి తన భాషను మార్చుకోవాలని, వెంటనే విద్యార్థిలోకానికి క్షమాపణలు చెప్పాలని, లేని పక్షంలో రేవంత్ ఇంటిని ముట్టడించి గుణపాఠం చెప్తామని హెచ్చరించారు. మంత్రి శ్రీధర్ బాబు, సీఎం రేవంత్ రెడ్డి అబద్ధాలు చెప్తూ అసెంబ్లీని, మీడియాను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. శాంతియుతంగా ధర్నా చేస్తున్న విద్యార్థులను చుట్టుముట్టి పోలీసులతో దాడులు చేయించారని మండిపడ్డారు. ఆడపిల్లలని చూడకుండా విద్యార్థినులను నెట్టివేశారని ఆవేదన వ్యక్తంచేశారు. పోలీసులను దాటుకుని విద్యార్థులు ఐక్యతతో దిష్టిబొమ్మను దహనం చేశారు.