సిటీబ్యూరో, జులై 3(నమస్తే తెలంగాణ): బెదిరింపులకు పాల్పడుతూ ఐదు కోట్లు వసూలు చేద్దామనుకున్న ముగ్గురిని రాచకొండ ఎస్వోటీ పోలీసులు అరెస్ట్ చేశారు. శనివారం నేరేడ్మెట్ పోలీస్ కమిషనరేట్లో సీపీ మహేశ్ భగవత్ ఈ కేసు వివరాలను వెల్లడించారు. యాదాద్రి- భువనగిరి జిల్లా మాటూర్ గ్రామానికి చెందిన సందేపల్లి క్రాంతికుమార్, సందేపల్లి సింహాద్రి, ఆలేరు మండలం సోమరాజిబావి గ్రామానికి చెందిన సంఘి జశ్వంత్ దోస్తులు. ఈ ముగ్గురు కలిసి ఉప్పల్ రిజిస్ట్రేషన్ కార్యాలయం పక్కన అద్దెకుంటున్నారు. క్రాంతికుమార్ యాడ్ ఏజెన్సీ నిర్వహిస్తుండగా అతడి సోదరుడు సింహాద్రి స్విగ్గీ, జొమాటో తరహాలో ఆర్వో వాటర్ డెలివరీకి సంబంధించిన ఓ యాప్ను రూపొందించారు. దీని నిర్వహణకు డబ్బులు అవసరం పడటంతో ఈ విషయాన్ని క్రాంతి కుమార్కు వివరించారు.
దీంతో ఈ యాప్పై పెట్టుబడి పెట్టాలంటూ యాదాద్రి-భువనగిరి జిల్లాకు చెందిన పేరొందిన రియల్ వ్యాపారులను సంప్రదించాలనుకున్నారు. ఈ ముగ్గురు యాదగిరిగుట్టకు చెందిన బీర్ల అయిలయ్య, పోరెడ్డి శ్రీనివాస్ని కలిశారు. అయితే వారు అనాసక్తి చూపడంతో ఎలాగైనా వారి నుంచి ఐదు కోట్లు వసూలు చేయాలని ఆ ముగ్గురు నిర్ణయానికి వచ్చారు. తార్నాక ప్రాంతంలోని ఓ జ్యూస్ కేంద్రం నిర్వాహకుడి ఫోన్ నంబర్ కొట్టేశారు. ఆ నంబర్తో బీర్ల అయిలయ్యకు ఫోన్ చేసి ‘ముంబయి నుంచి ఖలీల్ను మాట్లాడుతున్నా.. నీవు రియల్ వ్యాపారంలో బాగా సంపాదించావు. నీ మీద ఐటీ సోదాలు జరిగాయి కదా.. నాకు ఐదు కోట్లు ఇవ్వకపోతే చంపేస్తా’ అని బెదిరించారు.
ఈ సంభాషణను రికార్డు చేసిన అయిలయ్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన అధికారులు దర్యాప్తు చేపట్టారు. ఫోన్ నంబర్ ఆచూకీ కనుగొనేందుకు ప్రయత్నించగా ఉత్తరప్రదేశ్ అని చూపించింది. కానీ ఫోన్లో మాట్లాడిన వ్యక్తులు తెలుగు వారు కావడంతో.. సాంకేతిక ఆధారాలతో పాటు సీసీ కెమెరాలతో కొన్ని దృశ్యాలను సేకరించారు. ఇంతలో అదే జిల్లాకు చెందిన రియల్ వ్యాపారి పోరెడ్డి శ్రీనివాస్ తనను బ్లాక్ మెయిల్ చేస్తూ రూ.10 లక్షలు డిమాండ్ చేస్తున్నారని ఎస్వోటీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే పోరెడ్డి శ్రీనివాస్ను బెదిరించేందుకు ఆ ముగ్గురు ఓ సిమ్ ద్వారా వాట్సాప్ను ఆక్టివేట్ చేశారు. ఆ తర్వాత సిమ్ను తొలగించి కేవలం వాట్సాప్ మాత్రమే వాడుతున్నారు.
ఈ వాట్సాప్కు ఇంటర్నెట్ నుంచి ఓ అందమైన యువతి ఫొటోను డౌన్లోడ్ చేసి డీపీగా పెట్టి.. వసుమతి పేరుతో పోరెడ్డికి పలు సందేశాలు పంపారు. మహిళ చాటింగ్ చేస్తున్నట్లుగా శ్రీనివాస్ను నమ్మించారు. వీడియో కాల్ మాట్లాడి వాటిని రికార్డ్ చేసి పెట్టుకున్నారు. వాటిని ఆయనకు పంపి రూ.10 లక్షలు డిమాండ్ చేశారు. ఈ వివరాలను సేకరించిన పోలీసులు సాంకేతిక ఆధారాలు సేకరించి బెదిరింపులకు పాల్పడుతున్నది ఒకే ముఠా అని గుర్తించారు. సీసీ కెమెరాల ఆధారంతో క్రాంతికుమార్, సింహాద్రి, జశ్వంత్ను అదుపులోకి తీసుకొని విచారించారు. బెదిరింపులకు పాల్పడింది తామేనని ఒప్పుకున్నారు. అత్యంత చాకచక్యంగా ఈ కేసును ఛేదించిన ఎస్వోటీ డీసీపీ సురేందర్రెడ్డి, ఇన్స్పెక్టర్ సత్యనారాయణ, ఇతర సిబ్బందిని సీపీ అభినందించారు.