ముషీరాబాద్, జనవరి 9 : అడిక్మెట్ డివిజన్ పద్మకాలనీలో నాలుగు దశాబ్దాలుగా ఎదురవుతున్న వరద నీటి సమస్యకు ఎట్టకేలకు మోక్షం లభించనుంది. ఇటీవల చేపడుతున్న నాలా విస్తరణ, స్లాబు(బ్రిడ్జి) నిర్మాణ పనులు తుదిదశకు చేరుకోవడంతో త్వరలో ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు. రేలింగ్ నిర్మాణ పనులు త్వరలో పూర్తి చేసిన వచ్చే నెలలో అందుబాటులోకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. గత యేడాది క్రితం పద్మకాలనీ హెరిటేజ్ భవనం వద్ద ఇరుకుగా ఉన్న నాలా విస్తరణ, వాహనాల రాకపోకలకు అనువుగా బ్రిడ్జి నిర్మించాలని ప్రతిపాదించారు. ఇందుకోసం నాగమయ్యకుంట నాలా, పద్మకాలనీ నాలాలపై రెండు చోట్ల కలిపి రరూ.12 కోట్లు మంజూరు చేశారు.
ఏడాది కాలంగా పనులు చేపడుతున్నారు. ఇటీవల నాగమయ్యకుంట బ్రిడ్జి నిర్మాణ పనులు పూర్తి చేసి పద్మకాలనీ నాలాపై స్లాబు నిర్మాణ పనులపై దృష్టిసారించారు. ఇందులో భాగంగా ఇప్పటికూ నాలాను 12 మీటర్ల మేర విస్తరించి, వాహనాల రాకపోకలకు అనువుగా బ్రిడ్జి నిర్మాణ పనులు చేపట్టారు. ప్రస్తుతం నాలాకు ఇరువైపులా ప్రహారీ, స్లాబు నిర్మాణ పనులు పూర్తి చేసి బ్రిడ్జిపై రోడ్డు నిర్మాణ పనులు చేపడుతున్నారు. అదేవిధంగా హెరిటేజ్ బిల్డింగ్ నుంచి ఫీవర్ ఆస్పత్రి వెనకవైపు సాగర్ నాలా వరకు నాలా విస్తరణ పనులు కొనసాగుతున్నాయి. ఈ పనులు పూర్తయితే ముంపు సమస్యకు మోక్షం లభించనుంది.
వరద నీటితో ఇక్కట్లు..
భారీ వర్షం కురిస్తే పద్మకాలనీలో ఇళ్ల్లల్లోకి వరద నీరు చేరడం, స్థానికులు రోజుల తరబడి ఇబ్బందులు పడుతుండేవారు. వరద కారణంగా వచ్చిన బురదతో రెండు మూడు రోజులు ఇక్కట్లు పడుతుండేవారు. ఇక రాత్రిళ్లు ఒక్క సారిగా వరద వస్తే ఇళ్లపైకి చేరుకొని ప్రాణాలు కాపాడుకోవడం, వరద తగ్గిన తరువాత తిరిగి ఇళ్లకు చేరుకోవడం జరుగుతుండేది. ఇక రోడ్లపై పేరుకుపోయిన బురద జీహెచ్ఎంసీ సిబ్బంది తొలగిస్తే కానీ కాలు బయట పెట్టలేని పరిస్థితి ఉండేది కాదు.
ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం
వరద నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడానికే నాగమయ్యకుంట, పద్మకాలనీల్లో నాలాను విస్తరించి బ్రిడ్జిని నిర్మిస్తున్నాం. వరద సమస్యకు తావులేకుండా వాహనాల రాకపోకలు సాఫీగా సాగేలా బ్రిడ్జి నిర్మిస్తున్నాం. ఇప్పటికే నాగమయ్యకుంట బిడ్జి నిర్మాణ పనులు పూర్తి చేశాం. త్వరలో పద్మకాలనీ బ్రిడ్జి, నాలా విస్తరణ పనులు పూర్తి చేసి అందుబాటులోకి తీసుకువస్తాం.
-ముఠా గోపాల్, ఎమ్మెల్యే