నేరేడ్మెట్ , మార్చి 12: ఉద్యోగం వచ్చిన తర్వాత భార్య ప్రవర్తనలో మార్పురావడంతోపాటు విడాకుల కోసం వేధిస్తుండడంతో మనస్తాపానికి గురైన భర్త ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన నేరేడ్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..మంచిర్యాల జిల్లా, మందమర్రి మండలం, రామకృష్ణాపురంకు చెందిన నగెల్లి శ్రీనివాస్ (41) ప్రస్తుతం నేరేడ్మెట్ లక్ష్మీనగర్లో నివాసం ఉంటూ ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు.
ఇతనికి 2012లో సట్లపల్లి జ్యోతితో వివాహం జరిగింది. వీరికి ఒక కుమారుడు ఉన్నాడు. కాగా.. భార్య గ్రూప్స్ పరీక్షలకు ప్రిపేర్ అవుతుండగా శ్రీనివాస్ ప్రోత్సాహం అందించాడు. జ్యోతి ప్రభుత్వ ఉద్యోగం సాధించి.. ప్రస్తుతం ఎక్సైజ్ సీఐగా పనిచేస్తున్నది. అయితే.. ఉద్యోగం వచ్చిన తరువాత జ్యోతి.. భర్తను దూరం పెట్టడమే కాకుండా, శ్రీనివాస్ కుటుంబ సభ్యులపై వరకట్న వేధింపుల కేసు, విడాకుల కేసు కూడా పెట్టినుట్లు సమాచారం. దీంతో గత నాలుగు నెలలుగా శ్రీనివాస్.. భార్యకు దూరంగా ఉంటున్నాడు.
కోర్టు కేసులు, భార్య వేధింపుల కారణంగా తీవ్ర మనస్తాపానికి గురైన శ్రీనివాస్.. భార్య వేధింపులు, కేసుల కారణంగా ఆత్మహత్య చేసుకుంటున్నానని సూసైడ్ నోట్ రాసి మంగళవారం రాత్రి ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గమనించిన శ్రీనివాస్ సోదరుడు శివకృష్ణ వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. మృతుడి సోదరుడి ఫిర్యాదు మేరకు శ్రీనివాస్ భార్య జ్యోతి సహా మరో 10 మందిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.