GHMC | సిటీబ్యూరో, మార్చి 2 (నమస్తే తెలంగాణ) : బల్దియాలో పోస్టింగ్లోకి రావడం ఎంత సులభమో…బదిలీ జరిగితే.. తిరిగి అదే స్థానంలోకి రావడం పరిపాటిగా మారుతున్నది. కొందరు కమిషనర్ ఆదేశాలు కాదు కదా..చివరకు ప్రభుత్వ ఆదేశాలు సైతం దిక్కరిస్తున్నారు. కొనసాగుతున్న పోస్టింగ్లో ఏం ప్రయోజనాలు ఆశిస్తున్నారో తెలియదు కానీ పైరవీలతో యథేచ్ఛగా తిరిగి బదిలీ అయినా స్థానాన్ని దక్కించుకుంటున్నారు. కారణాలు ఏమైనా కానీ నిర్ణయాలకు కట్టుబడి పనిచేయాల్సిన ఉన్నతాధికారులు మేం పొమ్మంటే పోము.. ఇక్కడే ఉంటాం..జీహెచ్ఎంసీలోనే కొనసాగుతామనే ధోరణిలో ఉంటున్నారు. విధుల్లో నిర్లక్ష్యం వహించిన శేరిలింగంపల్లి ఏఎంఓహెచ్ నగేశ్ నాయక్పై కమిషనర్ రోనాల్డ్ రాస్ బదిలీ వేటు వేశారు. మాతృసంస్థకు వెళ్లి పనిచేయాల్సిన ఈ అధికారి..కొన్ని రోజుల్లోనే తిరిగి మళ్లీ అదే స్థానాన్ని దక్కించుకోవడం గమనార్హం.
అలాగే ఆసిఫాబాద్ కొమ్రం భీం జిల్లా కలెక్టర్గా స్నేహకు పోస్టింగ్ ఇస్తూ ప్రభుత్వం ఫిబ్రవరి 28న ఉత్తర్వులు ఇచ్చింది. అయితే ఏం జరిగిందో ఏమో కానీ 24 గంటలు గడవక ముందే పాత స్థానంలోకి తిరిగి బదిలీ చేయించుకున్నారు. కొమ్రం భీం జిల్లా కలెక్టర్గా ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ వెంకటేశ్ దోత్రెను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లా కలెక్టర్గా వచ్చిన పోస్టింగ్ను కాదని మరీ జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్గా కొనసాగేందుకు స్నేహ శబరీష్ మొగ్గు చూపడం వెనుక ఏం మతలబు ఉందోనని ఉద్యోగుల్లో చర్చ జరుగుతున్నది. జిల్లా కలెక్టర్ హోదాను పక్కన పెట్టి జోనల్ కమిషనర్గా కొనసాగేందుకు ఎందుకంత ఆసక్తి అనేది అంతుచిక్కని ప్రశ్న. అయితే ప్రభుత్వ ఉత్తర్వులు, కమిషనర్ ఆదేశాలను గంటల వ్యవధిలోనే మార్పించగల అధికారుల నైపుణ్యంపై ఉద్యోగ వర్గాల్లో చర్చకు దారితీసింది.