మన పూర్వీకుల చరిత్రకు సాక్ష్యంగా నిలుస్తున్నది ఎథ్నిక్ ఆర్ట్ ఎగ్జిబిషన్. పూర్వీకుల జీవన శైలి, సంస్కృతిపై ఆద్య కళ పేరుతో నగరంలోని స్టేట్ ఆర్ట్స్ గ్యాలరీలో ఏర్పాటు చేసిన ప్రదర్శనలో కళాకృతులు కొలువుదీరాయి. ఆదిమ జాతుల సంస్కృతి సంప్రదాయాలు, వారి జీవన వైవిధ్యాన్ని తెలిపే వాయిద్య పరికరాలు, అరుదైన సాహిత్యం, శిలా శాసనాలు, తోలు పుస్తకాలు, ట్రైబల్ మెటల్ ఆర్ట్ వర్క్స్.. ఇలా.. మన ప్రాంత సంస్కృతిని తెలిపే అరుదైన వస్తువులను ఈ ప్రదర్శనలో ఉంచారు. 500 ఏండ్ల కిందట వినియోగించిన పలు రకాల వస్తువులు, ఆదివాసీ, గిరిజన, జానపద కళాకారులు ఉపయోగించిన పలు సంగీత వాయిద్య పరికరాలు, వివిధ రకాల లోహ విగ్రహాలు వంటివి ఆకర్షణగా నిలుస్తున్నాయి.
లోహంతో తయారు చేసే గజ్జెలను జానపద సంగీతం, వీధి నాటకాల్లో కళాకారులు విరివిగా వాడుతుంటారు. భరతనాట్యం, కూచిపూడి కళాకారులు సైతం ఉపయోగిస్తుంటారు.
ఆదివాసీలు కాళ్లకు ధరించే ఆభరణాలు ఇవి. వారు నడుస్తుంటే.. లయబద్ధంగా వినబడే శబ్ధాలను ఆధారంగా చేసుకొని.. అనేక జానపద గేయాలు రూపొందించబడ్డాయి.
వివిధ రకాల జంతువుల చర్మంతో తయారు చేసిన డప్పులపై పలు రకాలైన శబ్ధాలతో సంగీతాన్ని సృష్టిస్తారు. నేటికీ పలు వాయిద్య పరికరాలను వినియోగించడం విశేషం.
ఆదివాసీలు గ్రామీణ ప్రాంతాల్లో అనేక రకాల ఆకృతుల్లో డప్పులను, తప్పెట్లను రూపొందించి వాటి ద్వారా దరువు వేస్తుంటారు. జానపద కళాకారులు ఎక్కువగా వీటిని వినియోగిస్తున్నారు.
కశ్మీర్లో ప్రసిద్ధమైన సంతూర్ వాయిద్యాన్ని పాశ్చాత్య దేశాల్లో ఉపయోగించే తంత్రీ వాయిద్యాలను సమ్మిళితం చేసి పుల్లలతో కొడుతూ సంగీతాన్ని సృష్టిస్తుంటారు. కడ్డీ వీణకు మూడు, నాలుగు తంత్రులు ఉన్నప్పటికీ.. అనేక సంగీత స్వరాలను సృష్టించవచ్చు.
ఇదో రకమైన డోలు వాయిద్యం. కొండరెడ్లు తమ నృత్యాల్లో, కొలువుల్లో ఈ వాయిద్యాన్ని వాడుతుంటారు. దీని ద్వారా వెలువడే శబ్ధం చాలా దూరం వినబడుతుంది. పనస మొద్దుకు రెండు వైపులా జంతువుల చర్మాన్ని అతికించి డోలు రూపంలో దీన్ని తయారు చేస్తారు.
మెక్సికో, ఆఫ్రికా దేశాల్లోని ఆదివాసీలు ఉపయోగించే భారీ చర్మ వాయిద్యాలను రుంజా వాయిద్యాలుగా పిలుస్తుంటారు. వెయ్యి ఏండ్ల కిందట నుంచి తెలుగు సాహిత్యంలో ఈ వాయిద్యాలను వినియోగించినట్లు చరిత్రకారులు గుర్తించారు. వీటి ద్వారా 32 రకాల ధ్వనులను సృష్టించవచ్చు.
లోహంతో రూపొందించిన పలు రకాలైన దీపాలు, దేవతా మూర్తుల ప్రతిమలివి. వీటిని ఆదివాసీ తెగల ఉత్సవాల్లో పూజిస్తుంటారు.
ఆదివాసీలు, గ్రామీణులు ధాన్యాన్ని, పంట గింజలను కొలిచేందుకు గిద్ద, షేరు, సోల తదితర పరిమాణాల్లో విభిన్న ఆకృతుల్లో ఇలా వస్తువులు రూపొందించి వాడుతుంటారు.
ఆదిలాబాద్ ఏజెన్సీ ప్రాంతాల్లో గోండులు, ఆదివాసీలు డోక్రా లోహ కళాకృతులను ఇత్తడితో తయారు చేస్తారు. అత్యంత నైపుణ్యంతో వీటిని మల్చుతారు.
కుండను బోర్లించి పైన చాటను కప్పి, విల్లును దానిపై ఆనిస్తారు. పక్క పక్కనే కుండలను ఒకే విధంగా వాయిస్తూ.. పాటలు పాడుతుంటారు. గానం, వాయిద్య శబ్ధంతో మహిళలు మాత్రమే ఉపయోగించే సంగీత వాయిద్య పరికరమిది.
గోండుల సాంప్రదాయ నృత్య రీతి అయిన గుస్సాడీ నృత్యం సందర్భంగా భారీ డోళ్లను మెడకు వేసుకొని నెత్తిన నెమలీకలతో తయారు చేసిన టోపీని ధరించి సామూహికంగా నృత్యాలు చేస్తారు.
చెట్ల కొమ్మలు, వాటి కాయలు, గింజలను సాధనాలుగా చేసుకొని సంగీతాన్ని సృష్టించేవారు. వాటిని గిల్ల, జిల్లెగడ గజ్జెలు అంటారు.
పురాతన కాలంలో రాజులు, జమిందార్లు, ప్రభుత్వాలు కొన్ని ఆదేశాలను జారీ చేసేవారు. వాటిని లోహ పత్రాలపై లిఖించేవారు. వాటినే శాసనాలుగా చెబుతారు. వేల సంవత్సరాల కిందట వీటిని ఉపయోగించినట్లు చరిత్రకారులు చెబుతున్నారు.
పంబ అనేది రెండు పొడుగు డోళ్లను కలిపి ఒకే జోడుగా తయారు చేస్తారు. దాన్ని చెక్క, ఇత్తడితో తయారు చేసి రెండు వైపులా చర్మాన్ని అతికించి వాయిస్తారు.
సారంగి వాయిద్యం, తోటి బుర్ర వాయిద్యాలపై తంత్రిని మీటుతూ.. సంగీతాన్ని సృష్టిస్తారు. బుర్రకథలు, ఒగ్గు కథల్లో వీటిని వాడుతారు.
ప్రాచీన భారతంలో వివిధ రకాలైన కావ్యాలు, కథలు, చరిత్రలను తాళపత్రాల మీద లిఖించేవారు. వీటిని తాటాకులతో తయారు చేస్తారు.