వ్యవసాయ యూనివర్సిటీ, మార్చి 10 : జనం మెచ్చేలా తెలంగాణలో న్యూట్రీహబ్ను ఏర్పాటు చేశారని, దీనిని ఆదర్శంగా తీసుకుని దేశంలోని ప్రధాన కేంద్రాల్లో ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామని ఢిల్లీకి చెందిన డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇండియా (డీఎస్టీ) కార్యదర్శి ఎస్.చంద్రశేఖర్ అన్నారు. శుక్రవారం రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ ఐఐఎమ్ఆర్లో ఏర్పాటు చేసిన కామన్ ఫెసిలిటీ సెంటర్ను ఆయన ప్రారంభించి మాట్లాడారు.
ప్రస్తుత పరిస్థితుల్లో దేశ ప్రజలకు మిల్లెట్స్ ఎంతో అవసరమని వాటిని బిస్కెట్స్, సూప్స్, జావలా కాకుండా అనేక రకాలుగా వాటిని రోజువారీ ఆహారంలో వినియోగించేలా ప్రజలను చైతన్యం చేయాలన్నారు. అలాగే న్యూట్రీహబ్స్ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సెంటర్ను ఆదర్శంగా తీసుకుని ఢిల్లీ, ఛత్తీస్గఢ్ జార్ఖండ్, మహారాష్ట్ర తదితర ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. ఇక్కడ ఉన్న యంత్ర సామగ్రిని ఉపయోగించుకుని తక్కువ రుసుంతో జొన్న, రాగి, సజ్జ వంటి ముడి ధాన్యాన్ని తీసుకు వచ్చి ఇక్కడే తమకు నచ్చిన విధంగా తయారు చేసుకుని వెళ్లే అవకాశం ఉందని న్యూట్రీహబ్ సీఈవో దయాకర్ రావు తెలిపారు.