సిటీబ్యూరో, అక్టోబర్ 22(నమస్తే తెలంగాణ): ఏదైనా చర్మ వ్యాధి, తుమ్ములు, దగ్గులు లాంటివి రావడంతో చాలా మంది నోటి నుంచి అలర్జీ కారణంగా ఇలా జరుగుతుందని నిత్యం వింటుంటాం..! అలర్జీ అనేది ఒక రకమైన దీర్ఘకాలిక వ్యాధి. కొన్ని రకాల పదార్ధాలు, వాతావరణ పరిస్థితులు పడకపోవడం వల్ల ఈ అలర్జీ సమస్యలు ఏర్పడతాయి. అయితే, రోగికి ఉన్న అలర్జీ ఏ రకమైనది? దానికి గల కారకాలేంటి? తదితర వ్యాధి మూలాలను గుర్తించేందుకు ఎర్రగడ్డ ఛాతి దవాఖాన వైద్యులు చర్యలు చేపట్టారు.
సాధారణంగా కొంత మంది రోగులకు వంశపార్యపరంగా ఈఅలర్జీ సమస్యలు వెంటాడితే మరికొందరికి వివిధ రకాల కారణాల వల్ల ఎదురవుతాయి. అలర్జీ అనేది దీర్ఘకాలిక వ్యాధి కావడంతో వీటి చికిత్సకు అయ్యే ఖర్చు కూడా అధికమే. ఇలాంటి ఆర్ధిక భారమైన చికిత్సను నిరుపేదలకు అందించాలనే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర సర్కార్ ఈ నెల 6న ఎర్రగడ్డ ఛాతి దవాఖానలో ప్రత్యేకంగా ‘అలర్జీస్ క్లీనిక్’ను ప్రారంభించిన విషయం తెలిసిందే.
అయితే, అలర్జీలకు మెరుగైన చికిత్స అందించాలంటే అది ఏ రకమైన అలర్జీనో ముందుగా గుర్తించాల్సి ఉంటుంది. ఆ తరువాత వచ్చిన అలర్జీకి సంబంధించిన కారకాలు అంటే ఏ కారణాల వల్ల అలర్జీ ప్రభావం చూపుతుందో తెలుసుకుంటే చికిత్స సులభతరమవుతుంది. అందుకోసం అలర్జీ నిర్ధారణ అనేది చికిత్సలో కీలక పాత్ర పోషిస్తుందంటున్నారు వైద్యులు.
ఛాతి దవాఖానలో ప్రారంభించిన అలర్జీ క్లినిక్కు రోగుల తాకిడి పెరుగుతోంది. నెలలో నాలుగు రోజులు ఈ క్లినిక్ ద్వారా రోగులకు ఓపీ సేవలు అందిస్తున్నామని, ప్రతి బుధవారం అలర్జీ క్లినిక్ సేవలు అందుబాటులో ఉంటాయని దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ మహబూబ్ ఖాన్ తెలిపారు. ప్రారంభంలో 10 నుంచి 20 మంది రోగులు రాగా, ప్రస్తుతం 100 మందికి పైగా అలర్జీ క్లినిక్లో ఓపీ సేవలు పొందుతున్నారు.
ఎర్రగడ్డ ఛాతి దవాఖానలో తొలిసారిగా అలర్జీ క్లీనిక్ను ప్రారంభించాం. ప్రస్తుతం ఓపీ సేవలు అందిస్తు న్నాం. అయితే, రోగులకు సంబంధించిన వ్యాధిని గుర్తిస్తే చికిత్స సులభమవుతుంది. ఇందుకోసం ప్రత్యేకంగా ‘స్కిన్ ప్రిక్’ పరీక్షలను నిర్వహించేందుకు చర్య లు మొదలు పెట్టాం. వారం పది రోజుల్లో ఈ నిర్ధారణ పరీక్షలను ప్రారంభిస్తాం.
స్కిన్ ప్రిక్ పరీక్షల ద్వారా రోగికి ఉన్న అలర్జీ ఏ రకమైనదో గుర్తించడంతో పాటు దేని వల్ల వస్తుందో కూడా నిర్ధారించడం జరుగుతుంది. ఈ రెండు ప్రధాన మూలాలు తెలుసుకుంటే మెరుగైన చికిత్స అందించగలుగుతాం. ఖరీదైన మందులను పూర్తి ఉచితంగానే అందించేందుకు అవసరమైన ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపించాం.- డాక్టర్ మహబూబ్ ఖాన్, సూపరింటెండెంట్, ఎర్రగడ్డ ఛాతి దవాఖాన