Book Fair | సిటీబ్యూరో, ఫిబ్రవరి 11 ( నమస్తే తెలంగాణ) : చిరిగిన చొక్కా అయినా తొడుక్కో..కానీ ఓ మంచి పుస్తకం కొనుక్కో’ అని కందుకూరి వీరేశలింగం పంతులు చెప్పిన మాట. పుస్తకం ఎంత విలువైనదో ఈ వ్యాఖ్యం వెల్లడిస్తుంది. అందుకే పుస్తకాలను చదవడం అలవాటు చేసుకుంటే విజయ తీరాల వైపునకు బాటలు వేసుకున్నట్టేనని నిపుణులు చెబుతున్నారు. పుస్తకం ఆనందాన్నిస్తుంది. అలవాట్లను మారుస్తుంది. మంచి స్నేహితుడిలా జీవితానికి మార్గనిర్దేశం చేస్తుంది. తరాల మధ్య వారధి వేస్తుంది. వ్యక్తిత్వాలను తీర్చిదిద్దుతుంది. ఎంతో కష్టపడి వివిధ రంగాల్లో పైకి వచ్చిన వారంతా పుస్తకానికి ప్రథమ ప్రాధాన్యతనిచ్చినవాళ్లేననే విషయం మరువకూడదు. అందుకే పుస్తక పఠనం అందరి దినచర్యల్లో భాగం కావాలని హైదరాబాద్ బుక్ ఫెయిర్ చాటుతున్నది. ఎన్టీఆర్ స్టేడియంలో కొలువుదీరిన హైదరాబాద్ జాతీయ పుస్తక ప్రదర్శనకు ఆదివారం భారీగా పుస్తక ప్రేమికులు తరలివచ్చారు. పుస్తక విలువను చాటడంలో రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థుల నుంచి మొదలు కొని సీనియర్ సిటిజన్స్ వరకు ఫెయిర్కు వచ్చి..నచ్చిన పుస్తకాలను కొనుగోలు చేశారు. సాహిత్యం, కథలు, క్రైమ్, పాలిటిక్స్, విదేశీ సంబంధాలు, వైల్డ్ లైఫ్, ఫొటోగ్రఫీ, ఎన్సైక్లోపీడియా, రొమాన్స్, ఫాంటసీ, రిలీజియన్ అండ్ సైన్స్, కుకింగ్, బయోగ్రఫిక్, చిల్డ్రన్, నాన్ ఫిక్షన్ తదితర వాటికి సంబంధించిన అన్ని పుస్తకాలు అందుబాటులో ఉండటంతో నగరవాసులు కొనుగోలు చేశారు.
రవ్వా శ్రీహరి వేదికపై బాలసాహిత్యంపై చర్చోపచర్చలు జరిగాయి. ముఖ్యఅతిథిగా పాల్గొన్న మణికొండ వేద కుమార్ మాట్లాడుతూ.. పిల్లల్లో సృజనాత్మకత పెంపొందడానికి పుస్తక పఠనం ఉపయోగపడుతుందని వివరించారు. పిల్లలకు సంబంధించిన రచనలు మరిన్ని రావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్కు చెందిన యాపల్ గూడ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలకు చెందిన 18 మంది విద్యార్థులు ఆంగ్లంలో రాసిన కథల పుస్తకం ‘ద స్టోరీస్ ఆఫ్ యాపల్ గుడా చిల్డ్రన్’ పుస్తకాన్నీ బాలసాహితీ వేత్తలు వీఆర్ శర్మ ఆవిష్కరించారు.
ఫ్యాన్సీ డ్రెస్ పోటీలు, షాడో ప్లే కార్యక్రమాలు జరిగాయి. పిల్లలు అధిక సంఖ్యలో పాల్గొని సందడి చేశారు. విభిన్న రకాల డిజైన్లతో కూడిన దుస్తులు ధరించి వాక్తో అలరించారు. అనంతరం సాయంత్రం జరిగిన కార్యక్రమంలో అమృతా ప్రీతమ్ రచించిన ‘పంజరం’ పుస్తకావిష్కరణ జరిగింది. స్త్రీ హక్కులను ప్రోత్సహించడంలో భాగంగా ఈ పుస్తకం ఉన్నదని వక్తలు తెలిపారు. అనంతరం రచయిత కృష్ణ రచించిన హార్మ్లెస్ క్రిమినల్స్ పుస్తకాన్ని ఆవిష్కరించారు. అనంతరం భాగ్యలక్ష్మి డ్యాన్స్ స్కూల్ విద్యార్థుల నృత్య ప్రదర్శన సభికులను అలరించింది.