సుల్తాన్బజార్, డిసెంబర్ 30 : ప్రమాదవశాత్తు మాటలు పోయిన వ్యక్తికి పదేండ్ల తర్వాత ఈఎన్టీ వైద్యులు శస్త్ర చికిత్స నిర్వహించి తిరిగి మాటలు రప్పించారు. ఈఎన్టీ ప్రొఫెసర్ డాక్టర్ ఆనందాచార్య తెలిపిన వివరాల ప్రకారం… కరీంనగర్ జిల్లా కమలాపూర్ మండలం కనిపర్తి గ్రామానికి చెందిన రాము(29) 12 సంవత్సరాల కిందట (2011లో) క్రిమీ సంహారక మందు తాగడంతో స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో, ఆ తర్వాత వరంగల్ జిల్లాలోని ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స చేయించారు.
రోగి పూర్తిగా కోలుకున్నప్పటికీ మాటలు రాకుండా పోయాయి. దీంతో పది సంవత్సరాల అనంతరం కోఠిలోని ఈఎన్టీ దవాఖానను సంప్రదించగా పరీక్షించిన వైద్యులు ఈ నెల 7న సర్జరీలో భాగంగా డ్యూమన్ స్టంట్ను అమర్చి మాటలు ప్రసాదించారు. సుమారు పదేండ్లుగా మాటలు లేకుండా ఉన్న రోగికి మాటలు తెప్పించిన వైద్య బృందాన్ని దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ టి.శంకర్ అభినందించారు. ఈ శస్త్రచికిత్సలో ప్రొఫెసర్ డాక్టర్ ఆనంద్ ఆచార్య, అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ సంపత్రావు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు డాక్టర్ ఫణిభూషన్, డాక్టర్ స్వామి, అనస్థీషియా విభాగం ప్రొఫెసర్ డాక్టర్ ఉమా, అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ శ్రీదేవి, అసిస్టెంట్ ప్రొఫెసర్లు డాక్టర్ ఉమా ప్రదీప్, డాక్టర్ నిఖిల తదితరులు పాల్గొన్నారు.