ఆదిబట్ల, ఆగస్టు 28 : ప్రభుత్వ భూములపై అక్రమార్కుల కన్ను పడుతున్నది. రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్కు కూతవేటు దూరంలోనే ప్రభుత్వ భూమిని అక్రమంగా ఆక్రమించి ప్రైవేట్ వెంచర్కు రహదారి ఏర్పాటు చేసిన ఘటన మహేశ్వరం మండలంలోని కొంగరకుర్థు-ఏ గ్రామంలో వెలుగు చూసింది. గ్రామంలోని సర్వే నంబర్ 289లో ఉన్న అసైన్డ్భూమి, టీజీఐఐసీకి సంబంధించిన భూమిలో సుమారు పది ఎకరాలు మేర ఆక్రమణకు పాల్పడి, వెంచర్లోకి వెళ్లేందుకు సుమారు కిలోమీటరు పొడవున అక్రమంగా రోడ్డును ఏర్పాటు చేసినట్లు అధికారులు గుర్తించారు. ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో శుక్రవారం మహేశ్వరం తహసీల్ధార్చిన్న అప్పలనాయుడు, ఆర్ఐ రాజిరెడ్డి ఆధ్వర్యంలో రెవెన్యూ అధికారులు చర్యలు చేపట్టారు. భారీ పోలీసు బందోబస్తు మధ్య ఐదు జేసీబీలను రంగంలోకి దించి ప్రభుత్వ భూమిలో అక్రమంగా ఏర్పాటు చేసిన రోడ్డును పూర్తిగా తొలగించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు భారీగా మోహరించారు.
ప్రభుత్వ భూములు కబ్జాకు గురవుతున్నా సంబంధిత అధికారులు ముందస్తుగా గుర్తించి చర్యలు తీసుకోవడంలో విఫలమవుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రైతులు పలుమార్లు ఫిర్యాదు చేసినప్పనటికీ పట్టించుకోకుండా వ్యవహరించారని ఆరోపిస్తున్నారు. చివరకు కలెక్టర్కు ఫిర్యాదు చేయడంతో మహేశ్వరం రెవెన్యూ అధికారులు స్పందించి రోడ్డును తొలగించారని స్థానికులు చెబుతున్నారు. ప్రభుత్వ భూమిని ఆక్రమించి ప్రైవేట్ వెంచర్కు రోడ్డు ఏర్పాటు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానిక రైతులు, ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వ భూములను కాపాడాల్సిన అధికార యంత్రాంగం కబ్జాలు జరిగిన తర్వాత స్పందించడంపై ఉన్నతాధికారుల దృష్టి సారించాలని కోరుతున్నారు.