తెలుగుయూనివర్సిటీ, ఫిబ్రవరి 17 : నిరంతరం ప్రజా ఉద్యమాల్లో భాగస్వామినై కృషిని కొనసాగిస్తున్నట్లు ప్రముఖ కవి, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పూర్వ ఉపాధ్యక్షుడు ఆచార్య ఎస్వీ.సత్యనారాయణ అన్నారు. తెలంగాణ సారస్వత పరిషత్తులో కొనసాగుతున్న పరిణత వాణి ప్రసంగం కార్యక్రమంలో భాగంగా గురువారం ఆయన 93వ ప్రసంగం చేశారు. హైదరాబాద్ పాత నగరంలో మధ్య తరగతి కుటుంబంలో పుట్టిన తనకు పాఠశాల స్థాయిలోనే గురువుల ప్రోత్సాహం లభించిందని తెలిపారు. 1970లో వచన కవిత్వం ప్రారంభించి, ఇప్పటి వరకు వచన, గేయ కవిత్వం, జీవిత చరిత్రలు, విమర్శలు, పరిశోధనలతో కలిపి సుమారు 30 గ్రంథాలు రచించానని తెలిపారు. మరో 30 ప్రత్యేక సంచికలకు సంపాదకత్వం వహించానని పేర్కొన్నారు. రేడియో రంగస్థలం టీవీ, సినిమా మాధ్యమాలలో కూడా పలు రచనలు వెలువడ్డాయని తెలిపారు. అభ్యుదయ రచయితల సంఘం, ప్రజా నాట్యమండలి వంటి ప్రజా సంఘాలలో కీలకపాత్ర వహించానని, ఓయూలో తెలుగు శాఖ అధ్యక్షులుగా అనంతరం తెలుగు విశ్వవిద్యాలయంలో ఉపాధ్యక్ష భాధ్యతలు నిర్వహించానని తెలిపారు. కార్యక్రమంలో పరిషత్తు అధ్యక్షులు ఆచార్య ఎల్లూరి శివారెడ్డి, ప్రధాన కార్యదర్శి డాక్టర్ జుర్రు చెన్నయ్య పాల్గొన్నారు. శుక్రవారం ప్రముఖ గేయ రచయిత డాక్టర్ సుద్దాల అశోక్ తేజ పరిణత వాణి ప్రసంగం ఉంటుందని నిర్వాహకులు తెలిపారు.