సిటీబ్యూరో, ఆగస్టు 11 (నమస్తే తెలంగాణ): గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో విద్యుత్ డిమాండ్ క్రమంగా పెరుగుతోంది. గతేడాది ఆగస్టులో ప్రతి రోజు 4.1 కోట్ల యూనిట్లు వినియోగం కాగా.. ఈ ఏడాది ఈ నెలలో 5.8 కోట్లకు చేరింది. వారం పదిరోజులుగా వర్షాలు లేకపోవడం.. అదే సమయంలో ఎండలు దంచుతుండటంతో ఉబ్బరం మొదలైంది. దీంతో ఇండ్లు, కార్యాలయాల్లో విద్యుత్ వినియోగం క్రమంగా పెరుగుతూ వస్తోంది. ఈ ఏడాది జనవరిలో రోజువారీ విద్యుత్ వినియోగం అత్యధికంగా 4.5 కోట్ల యూనిట్లుగా నమోదు కాగా.. అత్యల్పంగా 3.6 కోట్ల యూనిట్లుగా నమోదయ్యింది. ఫిబ్రవరిలో అత్యధికంగా 4.7 కోట్లు.. మార్చిలో 5.7 కోట్లు.. ఏప్రిల్, మేలో 7 కోట్ల యూనిట్ల దాకా వినియోగించగా.. వర్షాలతో ఒక్కసారిగా తగ్గుతూ నాలుగు కోట్ల యూనిట్లకు చేరింది. ఆగస్టు 5న 5.3 కోట్ల యూనిట్లు నమోదు కాగా.. 10వ తేది నాటికి 5.8 కోట్లకు చేరింది. వాతావరణంలో మార్పులతో ఎండలు ముదరడమే ఇందుకు కారణంగా అధికారులు చెబుతున్నారు. అయితే పెరుగుతున్న విద్యుత్ డిమాండ్కు అనుగుణంగా నిరంతరాయంగా సరఫరా చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని విద్యుత్ అధికారులు వివరిస్తున్నారు. దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎస్పీడీసీఎల్) పరిధిలో మొత్తం పీక్ అవర్ డిమాండ్ 7248 మెగావాట్ల వరకు ఉండగా.. అందులో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 9 సర్కిళ్లలో 2300 మెగావాట్ల నుంచి 2800 మెగావాట్ల వరకు విద్యుత్ పీక్ అవర్ డిమాండ్గా ఉంది.