హైదరాబాద్ : కుత్బుల్లాపూర్ సర్కిల్ పరిధిలోని చింతల్ భగత్సింగ్ నగర్లో ఓ ఎలక్ట్రిక్ స్కూటీ బ్యాటరీ ( Electric Scooty Battery) పేలిపోయింది. దీంతో ఆ ఇంట్లో ఉన్న సామాగ్రి కాలి బూడిదైంది. బ్యాటరీ పేలిన సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది.
వివరాల్లోకి వెళ్తే.. భగత్సింగ్ నగరకు చెందిన సాయికుమార్ రెడ్డి అనే వ్యక్తి ఇటీవలే ఓ ఎలక్ట్రిక్ స్కూటీని (hala hyd, HR -35) కిరాయికి తీసుకున్నాడు. ప్రతి రోజు రూ. 150 చెల్లించి ఆ స్కూటీని సాయి నడుపుకుంటున్నాడు. అయితే మంగళవారం రాత్రి తన ఇంట్లోని ఓ గదిలో స్కూటీకి ఛార్జింగ్ పెట్టి నిద్రలోకి జారుకున్నాడు. బుధవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఏవో విద్యుత్ తీగలు కాలినట్లు వాసన రావడంతో సాయికి మేలకువ వచ్చింది. ఆయన లేచి పక్క గదిలోని స్విచ్ను ఆన్ చేసేలోపే స్కూటీ బ్యాటరీ పేలిపోయింది. దీంతో మంటలు ఎగిసిపడ్డాయి. ఆ ఇంట్లోని సామాగ్రి కాలి బూడిదైంది.
అప్రమత్తమైన స్థానికులు కిటికీల నుంచి నీళ్లు చల్లి మంటలను అదుపు చేశారు. ఘటనాస్థలికి చేరుకున్న జీడిమెట్ల పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. బ్యాటరీ పేలిన సమయంలో ఆ గదిలో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది.