Vote | సిటీబ్యూరో, మార్చి 16 (నమస్తే తెలంగాణ): జిల్లాలో ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రాస్ స్పష్టం చేశారు. శనివారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో నగర సీపీ శ్రీనివాస్రెడ్డి, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్తో కలిసి మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా హైదరాబాద్ జిల్లా ఎన్నికల నిర్వహణపై ఎన్నికల అధికారి రోనాల్డ్ రాస్ మాట్లాడారు. గత శాసనసభ ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించామని, కొన్నిచోట్ల కలిగిన ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని లోక్సభ ఎన్నికలకు సర్వం సిద్ధం చేశామన్నారు.
అవసరమైన ఈవీఎంలు, సిబ్బందిపై పూర్తిస్థాయి ఏర్పాట్లు చేసుకున్నామన్నారు. పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ వెలువడిన నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తన నియామావళి శనివారం నుంచి అమల్లోకి వచ్చిందన్నారు. ఏప్రిల్ 18న నోటిఫికేషన్ వెలువడుతుందని, 25 వరకు నామినేషన్లు స్వీకరిస్తామన్నారు. మే 13న ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేశామని, జూన్ 4న కౌంటింగ్ ఉంటుందన్నారు.
హైదరాబాద్ జిల్లాలో హైదరాబాద్, సికింద్రాబాద్ రెండు పార్లమెంటరీ నియోజకవర్గాల్లో 15 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయన్నారు. ఎలక్షన్ కోడ్ అమలులోకి వచ్చినందుకు ఎన్నికల ప్రవర్తన నియామావళిని కట్టుదిట్టంగా అమలు చేస్తామన్నారు. జిల్లాలో మొత్తం 45,70,138 మంది ఓటర్లు ఉన్నారని, ఇందులో పురుషులు 23,30,574, మహిళలు 22,39,240 , థర్డ్ జెండర్ 324, సర్వీస్ ఓటర్లు 402, 846 మంది ఎన్ఆర్ఐ ఓటర్లు ఉన్నారని తెలిపారు. ఏప్రిల్ 14 వరకు కొత్త ఓటరు నమోదుకు అవకాశం ఉందని కమిషనర్ రోనాల్డ్ రాస్ తెలిపారు. లోక్సభ ఎన్నికల్లో పోలింగ్ శాతాన్ని పెంచేందుకు చర్యలు చేపడుతామని వివరించారు. ఎన్నికల ప్రవర్తనా నియామావళిని ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని నగర పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్రెడ్డి తెలిపారు.
పోలింగ్ కేంద్రాల్లో మెరుగైన మౌలిక వసతలు కల్పించాలని జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రాస్ అధికారులను ఆదేశించారు. పోలింగ్ కేంద్రాల్లో టాయిలెట్లు, తాగునీరు వంటివి తప్పనిసరిగా ఉండాలని, సహాయ రిటర్నింగ్ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి నివేదిక రూపొందించాలన్నారు. శనివారం సాయంత్రం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్, డీజీపీ రవిగుప్తాలతో ఎన్నికల అధికారుల వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో మూడు చొప్పున టీమ్లు మూడు షిఫ్టులలో 24గంటల పాటు పనిచేసేలా చర్యలు తీసుకున్నామన్నారు.
అదేవిధంగా ప్రైవేటు ప్రాపర్టీ, వెబ్సైట్లలో ప్రజాప్రతినిధులకు సంబంధించిన ఫొటోలు, ఫ్లెక్సీలు, వాల్ రైటింగ్ లను తొలగించి నివేదిక ఇవ్వాలన్నారు. ఎన్నికల ప్రచారానికి అవసరమైన సింగిల్ విండో పద్ధతిలో అనుమతులను ఆన్లైన్లో సువిధ ద్వారా పొందేలా రాజకీయ పార్టీలకు అవగాహన కల్పిస్తామన్నారు. సమావేశంలో హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి అనుదీప్ దురిశెట్టి, సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి హేమంత్ కేశవ్ పాటిల్, ఈవీడీఎం డైరెక్టర్ ప్రకాశ్రెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు.