గోల్నాక : ఓ ప్రైవేటు పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థి అదృశ్యమైన ఘటన అంబర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్సై సాల్వేరు మల్లేశం తెలిపిన వివరాల ప్రకారం..గోల్నాకకు చెందిన కె.సంతోష్ కుమారుడు (16)…స్థానిక శ్రీ నలంద టాలెంట్ హైస్కూల్లో 8వ తరగతి చదువుతున్నాడు.
కాగా..ఈ నెల 14వ తేదీ ఉదయం 8గంటల సమయంలో రోజూ మాదిరిగానే స్కూలుకు వెళ్తున్నానని చెప్పి వెళ్లాడు. కొంత సేపటి తర్వాత విద్యార్థి తల్లి బయటకు వచ్చి చూడగా మెట్లపై కుమారుడి స్కూల్ బ్యాగ్ కనిపించింది. వెంటనే ఆమె ఈ విషయాన్ని భర్త సంతోష్కు తెలిపింది.
ఆందోళన చెందిన తల్లిదండ్రులు తెలిసిన ప్రాంతాల్లో వెతికినా ఫలితం లేకపోవడంతో మంగళవారం బాధితుడి తండ్రి సంతోష్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.