సిటీబ్యూరో, జనవరి 23 (నమస్తే తెలంగాణ) : బ్రెయిన్ డెడ్ అయిన ఇద్దరు వ్యక్తుల అవయవాలను దానం చేయడానికి వారి కుటుంబ సభ్యులు ముందుకు రావడంతో 8 మందికి పునర్జన్మ లభించింది. కరీంనగర్ జిల్లా వెదురుగుట్టకు చెందిన 55 ఏండ్ల పెంచల సరోజకు జనవరి 21న అకస్మాత్తుగా తలనొప్పి రావడంతో కుటుంబ సభ్యులు ఆమెను చికిత్స నిమిత్తం సికింద్రాబాద్లోని కిమ్స్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. 48 గంటల పాటు ఇంటెన్సివ్ ట్రీట్మెంట్ ఇచ్చినప్పటికీ ఫలితం లేకపోవడంతో 22న సాయంత్రం వైద్యులు బ్రెయిన్ డెడ్గా ప్రకటించారు. జీవన్దాన్ కో-ఆర్డినేటర్ మృతురాలి కుటుంబ సభ్యులకు అవయవదానంపై అవగాహన కల్పించడంతో మృతురాలి భర్త కొమురయ్య, ఆమె ముగ్గురు పిల్లలు సరోజకు సంబంధించిన అవయవాలను ఇచ్చేందుకు ముందుకు వచ్చారు.
ఆమె నుంచి సేకరించిన రెండు కిడ్నీలు, కార్నియా, లివర్తో ఐదుగురికి పునర్మన్మ లభించనున్నది. అదేవిధంగా హైదరాబాద్ మల్కాజిగిరిలోని ఎన్ఎండీసీ కాలనీకి చెందిన 48 ఏళ్ల గుండారపు ఆనంద్ రెడ్డి జనవరి 18న రాత్రి ఎల్బీనగర్ వద్ద బైక్ మీదనుంచి పడిపోవడంతో కుటుంబ సభ్యులు స్థానికంగా ఉన్న కామినేని ఆసుపత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ జనవరి 21న బ్రెయిన్డెడ్ అయ్యాడు. అవయవదానం ప్రాముఖ్యతను తెలుసుకున్న మృతుడి కుటుంబ సభ్యులు ఆనంద్ రెడ్డి అవయవాలను దానం చేసేందుకు ముందుకు వచ్చారు. అతడి నుంచి సేకరించిన రెండు కిడ్నీలు, లివర్తో ముగ్గురికి పునర్జన్మ లభించనున్నది. ఇద్దరి కుటుంబ సభ్యుల స్ఫూర్తిని జీవన్దాన్ సంస్థ అభినందించింది.