చర్లపల్లి, డిసెంబర్ 2 : కేంద్ర కారాగారంలో శిక్ష అనుభవిస్తున్న ఖైదీల ఆరోగ్య పరిరక్షణకు కృషి చేయాలని రంగారెడ్డి జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్మన్, జడ్జి ఇందిర పేర్కొన్నారు. చర్లపల్లి కేంద్ర కారాగారంలో రంగారెడ్డి జిల్లా న్యాయసేవాధికార సంస్థ, లయన్స్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా ఉచిత వైద్య శిబిరాన్ని ఆమె తెలంగాణ జైళ్ల శాఖ ఐజీ మురళీబాబుతో కలిసి ప్రారంభించి ఖైదీలకు పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఖైదీలకు నాణ్యమైన వైద్య సేవలందించేందుకు ఉచిత వైద్య శిబిరాలు ఎంతగానో ఉపయోగపడుతాయని, ఖైదీలు వివిధ వ్యాధుల పట్ల అవగాహన కల్పించడంతోపాటు వారికి వైద్య సదుపాయాలు కల్పించేందుకు తగు చర్యలు తీసుకుంటామని ఆమె తెలిపారు. లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ గవర్నర్ కట్టంగూర్ హరీశ్రెడ్డి మాట్లాడుతూ.. లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పలు సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడంతో పాటు ఖైదీల ఆరోగ్య పరిరక్షణకు పలుమార్లు ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి వైద్య సేవలందిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో చర్లపల్లి కేంద్ర కారాగారం, వ్యవసాయక్షేత్రం సూపరింటెండెంట్లు సంతోష్కుమార్రాయ్, కళాసాగర్, వైద్యాధికారులు అరవింద్, సందీప్, లయన్స్ క్లబ్ ప్రతినిధులు మంద సురేశ్, శ్రీదేవి, డిప్యూటీ సూపరింటెండెంట్లు కాళిదాసు, శశికాంత్, జైలర్లు రామకృష్ణ, పరశురాములు, సురేశ్బాబు, సత్తయ్య, డిప్యూటీ జైలర్స్ జైనెహ్రూ, సురేశ్, సామంతు, విష్ణు, చంద్రశేఖర్, జయరాజులతోపాటు ఖైదీలు తదితరులు పాల్గొన్నారు.
ఐఏడీవీఎల్ ఆధ్వర్యంలో..
ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ డెర్మటాలిజిస్ట్, వెనిరియాలాజిస్ట్ అండ్ లెఫ్రాలాజిస్ట్(ఐఏడీవీఎల్)అధ్వర్యంలో కేంద్ర కారాగారంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని తెలంగాణ జైళ్ల శాఖ ఐజీ మురళీబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఖైదీలకు వివిధ వ్యాధుల పట్ల అవగాహన కల్పించడంతో పాటు మూత్రపిండాలు, చర్మ తదితర వ్యాధులపై ఉచిత వైద్య శిబిరం నిర్వహించి ఖైదీలకు వైద్య సేవలు అందించేందుకు ఐఏడీవీఎల్ కృషి హర్షణీయమన్నారు. అనంతరం ఖైదీలకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు.