రవీంద్రభారతి, ఫిబ్రవరి 2: ఫిలింనగర్ మాదిరిగానే బుల్లితెర నటీనటుల కోసం టీవీనగర్ ఏర్పాటుకు ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని ప్రభుత్వ సలహాదారుడు డాక్టర్ కేవీ రమణాచారి అన్నారు. ఆకృతి సంస్థ ఆధ్వర్యంలో టీవీ సీరియల్స్ ఉత్తమ నటీనటులకు రవీంద్రభారతి ప్రధాన వేదికలో అవార్డులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా డాక్టర్ కేవీ రమణాచారి, బీసీ కమిషన్ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్రావు హాజరయ్యారు. అనంతరం రమణాచారి మాట్లాడుతూ కళలు, కళాకారులంటే తనకు ఎంతో అభిమానమని, నటీనటులకు అవార్డులతోనే గుర్తింపు లభిస్తుందని అన్నారు.
తెలంగాణ బీసీ కమిషన్ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్రావు మాట్లాడుతూ సినిమాలకు తగ్గకుండా సీరియళ్లు నిర్మిస్తున్నారని అన్నారు. తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అనిల్ కుర్మాచలం మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ వెండితెర, బుల్లితెర రంగానికి పెద్దపీట వేశారని తెలిపారు. అనంతరం అవార్డులు పొందిన వారిలో రాధాకృష్ణ మలినేని, నటుడు హేమంత్, ఉత్తమ నటి గౌతమి, ప్రత్యేక ప్రశంస నవీనయాత, ఉదయ్ భాగవతుల, జానకి, ఉత్తమ నిర్మాత కోన రాము, ఉత్తమ నటుడు నిరుపమ్, ఉత్తమ నటి ప్రియాంకజైన్, ఉత్తమ నిర్మాత కేవీ శ్రీరామ్, ఉత్తమ నటుడు సూర్యతేజ, ఉత్తమ నటి తనూజ తదితరులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో సీల్వెల్ కార్పొరేషన్ చైర్మన్ బండారు సుబ్బారావు, జగదీశ్ చంద్ర, ఆకృతి సంస్థ అధ్యక్షుడు సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.