సిటీబ్యూరో, ఫిబ్రవరి 4 (నమస్తే తెలంగాణ): కరోనా చికిత్సలో భాగంగా వినియోగించిన స్టెరాయిడ్స్ ప్రభావంతో దేశవ్యాప్తంగా తుంటి సంబంధిత (ఏ వాస్యులర్ నెక్రోసిస్)కేసులు విపరీతంగా పెరిగాయని ఆర్థో వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. ‘టోటల్ హిప్ బేసిక్ టు అడ్వాన్స్’ అనే అంశంపై శనివారం మాదాపూర్లోని హైటెక్స్లో ఏర్పాటు చేసిన ఆర్థోపెడిక్ సర్జన్ల రెండు రోజుల జాతీయ సదస్సులో పలువురు ఆర్థోపెడిక్ సర్జన్లు పాల్గొని ప్రసంగించారు.
ఈ సందర్భంగా కిమ్స్ హాస్పిటల్కు చెందిన ప్రముఖ ఆర్థో సర్జన్, సదస్సు కార్యనిర్వాహక చైర్మన్ డాక్టర్ ఉదయ్కృష్ణ మైనేని మాట్లాడుతూ కొవిడ్ తరువాత చాలా మందిలో తుంటి సంబంధిత సమస్యలు పెరిగాయన్నారు. కరోనా చికిత్సలో భాగంగా స్టెరాయిడ్స్తో కూడిన మందులను మోతాదుకు మించి వినియోగించడం వల్ల ఈ సమస్య ఉత్పన్నమైనట్లు పలు అధ్యయనాల్లో తేలిందని వివరించారు. ఇలాంటి దుష్పరిణామాల నుంచి రోగులను కాపాడేందుకు ప్లీట్లెట్ రీజ్ ప్లాస్మా(పీఆర్పి), స్టెమ్సెల్ థెరపీ, బీమాస్(బోన్ మ్యారో యాస్పరేట్ స్టెమ్సెల్ థెరపీ కాన్సంట్రేషన్)వంటి అధునాతన పద్ధతులు అందుబాటులో ఉన్నాయని చెప్పారు.
వివిధ దేశాల నుంచి వచ్చిన 300 మంది ఆర్థోపెడిక్ సర్జన్లకు ఈ సదస్సు ద్వారా అవగాహన కల్పించినట్లు తెలిపారు. సీనియర్ సర్జన్లు డాక్టర్ విజయ్ బోస్, డాక్టర్ రమేశ్ కుమార్సేన్, గాంధీ దవాఖాన ఆర్థో సర్జన్ డాక్టర్ రవీందర్ మాట్లాడుతూ యువతరం ఆర్థో సర్జన్లకు పలు అంశాలపై అవగాహన కల్పించి నూతన చికిత్స పద్ధతులపై మార్గనిర్ధేశం చేశారు. తుంటి సమస్యలు, చికిత్స విధానాలు, మెథడాలజీ తదితర అంశాలను వివరించారు. ఈ సదస్సులో దేశంలోని వివిధ రాష్ర్టాలకు చెందిన ఆర్థో సర్జన్లు పాల్గొన్నారు.