కేపీహెచ్బీ కాలనీ, మార్చి 31 : పదో తరగతి పరీక్షల నిర్వహణకు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నట్లు కూకట్పల్లి, బాలానగర్ మండల విద్యాధికారులు తెలిపారు. ఈ యేడాది పదో తరగతి పరీక్షలు ఏప్రిల్ 3 నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో పరీక్ష కేంద్రాల గుర్తింపు.. ఆయా పరీక్ష కేంద్రాలలో విద్యార్థులకు కావాల్సిన ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టినిసారించారు. పరీక్ష కేంద్రాల్లో మాస్ కాపీయింగ్ నిరోధించే దిశగా సీసీ కెమెరాల నిఘాతో పాటు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఆయా పరీక్ష కేంద్రాల్లో సౌకర్యాలను దృష్టిలో పెట్టుకుని ఒక్కో పరీక్ష సెంటర్లో 200 నుంచి 240 మంది విద్యార్థులు పరీక్షలు రాసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పరీక్ష కేంద్రాల్లో విద్యుత్, తాగునీటి సౌకర్యాలను కల్పించడం.. విద్యార్థులు పరీక్షలు రాసేందుకు అణువుగా బెంచీలను ఏర్పాటు చేయనున్నారు. జిల్లా విద్యాధికారుల పర్యవేక్షణలో ఫ్లయింగ్ స్కాడ్లను ఏర్పాటు చేస్తూ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా విద్యార్థులు సౌకర్యవంతంగా పరీక్షలు రాసేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
కూకట్పల్లి, బాలానగర్ మండలాల పరిధిలో ఈ యేడాది సుమారు 10వేల మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాయనున్నారు. ఉమ్మడి మండలాలో పదో తరగతి పరీక్షలు రాసేందుకు 47 పరీక్ష కేంద్రాలను గుర్తించారు. బాలానగర్ మండలంలో 9 పరీక్ష కేంద్రాలు, కూకట్పల్లి మండలంలో 38 పరీక్ష కేంద్రాలను గుర్తించి ఆయా పరీక్ష కేంద్రాలలో విద్యార్థులు పరీక్షలు రాసేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ యేడాది బాలానగర్, కూకట్పల్లి మండలాల పరిధిలోని 13 ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు 1042 మంది ఉండగా మిగిలిన సుమారు 9వేల మంది ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు ఉన్నారు. ఈ విద్యార్థులంతా 47 పరీక్ష కేంద్రాల్లో పదో తరగతి పరీక్షలు రాయాల్సి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వ పదో తరగతి పరీక్షలను 11 పేపర్ల నుంచి 6 పేపర్లకు కుదించడంతో.. ఈ యేడాది పరీక్షలు రాసే విద్యార్థులు ఆరు రోజుల్లో ఏడు పేపర్లు రాయాల్సి ఉంటుంది. ఏప్రిల్ 10న సామాన్యశాస్త్రం పరీక్ష రోజున రెండు పేపర్లు.. ఫిజిక్స్, బయాలజీ పేపర్ల పరీక్షను వెంటవెంటనే రాయాల్సి ఉంటుంది. మిగిలిన రోజుల్లో రోజుకొకటి చొప్పున పరీక్షలు ఉంటాయి. ప్రతిరోజూ ఉదయం 9.30 నుంచి 12:45 వరకు పరీక్ష ఉంటుంది.
పదో తరగతి పరీక్షల నిర్వహణకు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నాం. కూకట్పల్లి, బాలానగర్ మండలాలలో సుమారు 10వేల మంది విద్యార్థులు ఈ యేడాది పదో తరగతి పరీక్షలు రాయనున్నారు. దీనికిగాను 47 పరీక్ష కేంద్రాలను గుర్తించి ఆయా పరీక్ష కేంద్రాలలో విద్యుత్, తాగునీరు, ఇతర సౌకర్యాలుండేలా చర్యలు తీసుకున్నాం. మాస్ కాపీయింగ్ను నిరోధించేందుకు పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలతో నిఘాను ఏర్పాటు చేశాం. విద్యార్థులు పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి. ఐదు నిమిషాలు ఆలస్యమైనా పరీక్ష కేంద్రంలోనికి అనుమతి ఉండదు. విద్యార్థులు అల్ఫాహారాన్ని తీసుకుని పరీక్షకు రావాలి. మొబైల్ ఫోన్లు, ఇతర వస్తువులకు అనుమతి లేదు. విద్యార్థులు నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు ఉంటాయి.
– ఆంజనేయులు, ఎంఈవో, కూకట్పల్లి, బాలానగర్ మండలం