అణు ఇంధన, దేశ రక్షణ విభాగానికి కావాల్సిన పరికరాలు అందజేస్తున్నాం
ఈసీఐఎల్ ఆవిర్భావ దినోత్సవంలో చైర్మన్ సంజయ్
చర్లపల్లి, ఏప్రిల్ 11 : స్వదేశీ పరిజ్ఞానంతో అణు ఇంధన, దేశ రక్షణ విభాగాలకు అనేక పరికరాలను ఈసీఐఎల్ సంస్థ అందజేసిందని ఈసీఐఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ రేర్ అడ్మిరల్ సంజయ్ చౌబే, డైరెక్టర్ పర్సనల్ సమీర్ ముఖర్జీ అన్నారు. ఆదివారం ఈసీఐఎల్ సంస్థ వ్యవస్థాపక దినోత్సవాన్ని సంస్థ అవరణలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఈసీఐఎల్ వ్యవస్థాపకుడు డాక్టర్ ఏఎస్రావు విగ్రహానికి సంజేయ్చౌబే, సమీర్ ముఖర్జీ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ గత ఐదు దశాబ్దాలుగా ఈసీఐఎల్ సంస్థ దేశానికి ఎన్నో సేవలు అందించిందన్నారు. ముఖ్యంగా అణు ఇంధన, దేశ రక్షణ విభాగానికి కావాల్సిన పరికరాలను పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించి అందజేశామని వారు గుర్తు చేశారు. ఈసీఐఎల్ సంస్థ ప్రపంచ వ్యాప్తంగా ఎలక్ట్రానిక్స్ రంగంలో ఎన్నో విజయాలను సొంతం చేసుకుందని, రాబోయే రోజుల్లో సంస్థ మరిన్ని విజయాలు సాధించే దిశగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈసీఐఎల్ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు భాస్కర్రెడ్డి మాట్లాడుతూ.. ప్రపంచంలో మారుతున్న టెక్నాలజీకి ధీటుగా పలు పరికరాలను తయారు చేసి విజయాలు సాధిస్తున్నామని పేర్కొన్నారు. కార్మికులు, ఉద్యోగుల సమష్టి కృషితో ఆర్థిక సంవత్సరపు లక్ష్యాలను సాధించామన్నారు. ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రజానాయక్, జనరల్ మేనేజర్ సుధాంశు, అనిల్సింఘాయి, అధికారులు, ఉద్యోగులు, కార్మికులు తదితరులు పాల్గొన్నారు.