చిక్కడపల్లి,నవంబర్ 2: జంటనగరాల్లో ఉన్న అసంఘటిత రంగ కార్మికులందరూ తమ పేర్లను తప్పని సరిగా ఈ-శ్రమ్ పోర్టల్లో నమోదు చేసుకోవాలని జంటనగరాల సంయుక్త కార్మిక కమిషనర్ డి.శ్యామ్ సుందర్ రెడ్డి సూచించారు. ఆర్టీసీ క్రాస్ రోడ్స్లోని కార్మిక శాఖ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలోని అసంఘటిత కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందన్నారు. ఈ-శ్రమ్ పోర్టల్లో నమోదు కోసం డిసెంబర్ నెలాఖరువరకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టినట్లు ఆయన తెలిపారు.అసంఘటిత కార్మికులందరూ ఈ-శ్రమ్ పోర్టల్లో పేర్లు నమోదు చేసుకోవడం ద్వారా వారికి సామాజిక భద్రతతో పాటు వివిధ సంక్షేమ పథకాలు అందుతాయని తెలిపారు. అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్(ఏఎల్ఓ)లు రెండు నెలల ఈ డ్రైవ్లో ప్రత్యేక క్యాంప్లు ఏర్పాటు చేసి నమోదు కార్యక్రమాన్ని వేగవంతం చేస్తారన్నారు.
అసంఘటిత కార్మికుల పేర్లను సీఎస్సీ(కామన్ సర్వీస్ సెంటర్)లో నమోదు చేసుకుని అక్కడికక్కడే ఐడీ కార్డులు పొందే సదుపాయం కల్పించామన్నారు. కార్మికుల్లో దాదాపు 90 శాతం మంది అసంఘటిత రంగ కార్మికులే ఉన్నారని తెలిపారు. ఈ పోర్టల్లో పేర్లను నమోదు చేసుకోవడానికి కార్మికులకు అవగాహన కల్పించేందుకు ప్రత్యేక క్యాంప్లు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందులో చేరిన ప్రతి అసంఘటిత కార్మికుడికి 12 అంకెలు గల ప్రత్యేక గుర్తింపు కార్డు(యూఏఎన్) -(యూనివర్సల్ ఐడెంటిఫికేషన్ నంబర్) ఇస్తామని తెలిపారు.
ఈ కార్డు ఉంటే ప్రభుత్వం అందించే అన్ని రకాల సామాజిక భద్రత పథకాలు, వివిధ సంక్షేమ పథకాలు వర్తింపజేస్తాయని వివరించారు. ఇందులో నమోదు చేసుకున్న ప్రతి కార్మికుడికి ఒక సంవత్సరం పాటు ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన(పీఎంఎస్బీవై) కింద రూ.2 లక్షలు, అంగవైకల్యం బీమా ఉచితంగా కల్పిస్తామని తెలిపారు. 16 నుంచి 59 సంవత్సరాల వయస్సులోపు, ఆదాయ పన్ను పరిధిలోకి రానివారు, ఈపీఎఫ్, ఈఎస్ఐ సదుపాయం లేని వారు అర్హులని తెలిపారు. అసంఘటిత రంగ కార్మిక కేటగిరిలో తప్పని సరిగా పనిచేస్తూ ఉండాలని వివరించారు.