బడంగ్పేట, జనవరి 7 : ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతున్నామని, అందుకు సీఎం కేసీఆర్ రూ.4వేల కోట్లు కేటాయించారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ప్రైవేటును వదిలి ప్రభుత్వ బడుల్లో చేరుతున్న విద్యార్థుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతున్నదని తెలిపారు. శుక్రవారం బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలో రూ.1.20 కోట్ల వ్యయంతో అదనపు తరగతి గదుల నిర్మాణం, సాయినగర్లో రూ.14లక్షలతో సీసీ రోడ్డు పనులకు మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి, డిప్యూటీ మేయర్ ఇబ్రాం శేఖర్, కార్పొరేటర్లతో కలిసి మంత్రి శంకుస్థాపన చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ప్రైవేట్ పాఠశాలల నుంచి 2.50లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో కొత్తగా అడ్మిషన్లు తీసుకున్నారని తెలిపారు. ఇంటర్లో లక్ష మంది విద్యార్థులు ప్రభుత్వ కళాశాలలో చేరారన్నారు. వెయ్యి గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేయడంతో మంచి ఫలితాలు వస్తున్నాయని, దీంతో గురుకుల పాఠశాలల్లో అడ్మిషన్ల కోసం పోటీ పడుతున్నారని తెలిపారు.
కొవిడ్ నిబంధనలు పాటించాలి
ప్రభుత్వ పాఠశాలల్లో కొవిడ్ నిబంధనలు పాటించే విధంగా చొరవ తీసుకోవాలని ఎంఈఓ కృష్ణయ్యకు మంత్రి సూచించారు. విద్యార్థులు తప్పని సరిగా మాస్కులు ధరించాలని తెలిపారు. ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులందరినీ పాస్ చేశామన్నారు. ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కష్ట పడాలని, తల్లిదండ్రులు చొరవ తీసుకోవాలని సూచించారు.