మాదాపూర్, ఆగస్టు 11: నిబంధనలను ఉల్లంఘించి దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి పైన నడిరోడ్డుపై పుట్టిన రోజు జరుపుకున్న ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మాదాపూర్ ఇన్స్పెక్టర్ రవీంద్ర ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం మాదాపూర్లో ఓ హాస్టల్లో నివాసం ఉంటున్న నర్సింహా రెడ్డి (25) తన పుట్టిన రోజైన మంగళవారం నాడు అదే హాస్టల్లో ఉంటున్న మరో ఇద్దరు స్నేహితులు హేమంత్ (25), ప్రేమ్చంద్ (25) లతో కలిసి అర్ధరాత్రి ఒకటిన్నరకు దుర్గం చెరువు చేరుకున్నారు. అక్కడి కేబుల్ వంతెనపై వాహనాలు ప్రయాణించే రోడ్డుపైనే కేకును కట్ చేశారు. అక్కడే ఉన్న ట్రాఫిక్ పోలీస్లు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మాదాపూర్ పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు.