సిటీబ్యూరో, డిసెంబర్ 22 (నమస్తే తెలంగాణ) : అసలు కరెన్సీకి 1:3 నిష్పత్తిలో నకిలీ కరెన్సీ ఇస్తామంటూ సినీ ఫక్కీలో మోసగాళ్ళనే మోసం చేస్తున్న ముఠాకు చెందిన ముగ్గురు నిందితులను ఎల్బీనగర్ ఎస్ఓటీ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి రూ.60 లక్షల డూప్లికేట్ కరెన్సీ (మనోరంజన్ బ్యాంక్ కరెన్సీ)తో పాటు మూడు 500 నోట్ల రూపాయలు, తప్పుడు నంబర్ ప్లేట్తో కూడిన ఎర్టిగా కారు, 6 సెల్ఫోన్లు, ఒక పోలీసు లాఠీ, పిస్తల్ను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు రాచకొండ పోలీసు కమిషనరేట్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీపీ సుధీర్బాబు, ఎస్ఓటీ డీసీపీ మురళీధర్, ఎల్బీనగర్ ఎస్ఓటీ ఏసీపీ మట్టయ్య, ఇన్స్పెక్టర్ సుధాకర్లతో కలిసి కేసు పూర్వాపరాలను వెల్లడించారు.
అదిలాబాద్ జిల్లాకు చెందిన మహ్మద్ బహుద్దీన్ అలియాస్ జావీద్(53) అటవీశాఖలో సీనియర్ అసిస్టెంట్. అయితే ఉట్నూరు రేంజ్ ఆఫీసులో విధులు నిర్వహిస్తున్న సమయంలో (2014లో) ఒక కేసులో సస్పెన్షన్కు గురయ్యాడు. అప్పటి నుంచి ఆర్థిక ఇబ్బందులకు గురైన బహుద్దీన్ ఎలాగైన సులభంగా డబ్బులు సంపాదించుకొనే క్రమంలో రియల్ఎస్టేట్ బ్రోకర్గా మారాడు. ఈ క్రమంలో అతడికి పలు రకాల మోసాలకు పాల్పడడంలో నిష్ణాతుడైన సల్మాన్తో పరిచయం ఏర్పడింది. డూప్లికేట్ నోట్లతో ఎలా మోసగించవచ్చో బహుద్దీన్కు శిక్షణ ఇవ్వడంతో పాటు అతడి ద్వారా నిజామాబాద్కు చెందిన అండ్రెసన్(37)ను పరిచయం చేసుకున్నాడు. కాగా అండ్రెసన్, నిర్మల్ జిల్లాకు చెందిన మగ్గిడి కిషన్(27) ఆర్జీఐఏ విమానాశ్రయంలో ఒకేచోట ట్యాక్సీ డ్రైవర్గా పనిచేస్తున్నారు.
ఇదిలా ఉండగా డూప్లికేట్ నోట్లతో జనాలను మోసం చేయడంలో శిక్షణ పొందిన బహుద్దీన్ ఈ విషయాన్ని అండ్రెసన్కు తెలిపి సులభంగా డబ్బులు సంపాదించవచ్చని అతడిని ప్రేరేపించించాడు. దీనికి అంగీకరించిన అండ్రెసన్ తన తోటి డ్రైవర్ కిషన్ను కూడా ఒప్పించాడు. ఈ క్రమంలో ముగ్గురు కలిసి నకిలీ నోట్లు చలామణి చేసే మోసగాళ్ళను గుర్తించారు. తమ వద్ద పెద్ద ఎత్తున నకిలీ నోట్లు ఉన్నాయని, 1:3 నిష్పత్తిలో ఒరిజినల్ నోట్లకు నకిలీ నోట్లను అందచేస్తామని నమ్మిస్తారు. ఈ ఒప్పందం మేరకు బహుద్దీన్, అండ్రెసన్లు తమ వద్ద ఉన్న మనోరంజన్ డూప్లికేట్ నోట్లను నకిలీ నోట్లుగా నమ్మించి, అవతలి గ్యాంగ్కు ఇస్తారు. ఆ కరెన్సీని అవతలి గ్యాంగ్ చెక్ చేసుకునేలోపు వెనకాల నుంచి కిషన్ అనే వ్యక్తి పోలీసు డ్రెస్లో విజిల్ వేస్తూ వస్తాడు.
దీంతో నకిలీ నోట్లు కొనేందుకు వచ్చిన అవతలి గ్యాంగ్ పోలీసులు వచ్చారనే భయంతో అక్కడి నుంచి పారిపోతారు. అనంతరం ఈ ముగ్గురు నిందితులు కలిసి యథేచ్చగా ఒరిజినల్ కరెన్సీని తీసుకుని వెళ్తారు. ఈ క్రమంలోనే ఈనెల 21న ముగ్గురు నిందితులు నగరంలోని బేగంబజార్లో మనోరంజన్ బ్యాంక్ కరెన్సీని కొనుగోలు చేశారు. అనంతరం ఓ వ్యక్తికి ఒరిజినల్ కరెన్సీ ఇస్తే 1:3 నిష్పత్తిలో నకిలీ కరెన్సీ ఇస్తామని నమ్మించారు. ఎల్బీనగర్లోని సితారా గ్రాండ్ హోటల్ వద్ద కరెన్సీ మార్చుకునేందుకు యత్నిస్తుండగా అక్కడే తనిఖీలు నిర్వహిస్తున్న ఎల్బీనగర్ ఎస్ఓటీ ఇన్స్పెక్టర్ సుధాకర్, స్థానిక పోలీసులతో కలిసి ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి 60 లక్షల మనోరంజన్ బ్యాంక్ కరెన్సీ(డ్యూప్లికేట్ కరెన్సీ)తో పాటు మూడు ఒరిజినల్ 500నోట్లు, సెల్ఫోన్లు, ఎర్టిగా కారును స్వాధీనం చేసుకున్నారు. గతంలో కూడా బహుద్దీన్ మహారాష్ట్ర, నిజామాబాద్, నిర్మల్, రాచకొండ పరిధిలో ఈ తరహా మోసాలకు పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు.