సిటీబ్యూరో, అక్టోబర్ 8(నమస్తే తెలంగాణ): యాపిల్ కంపెనీ మొబైల్ ఫోన్లకు సంబంధించిన డూప్లికేట్ సామగ్రిని విక్రయిస్తున్న దుకాణాలపై సెంట్రల్ జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. అబిడ్స్, దోమలగూడ పోలీస్స్టేషన్ల పరిధిలో నలుగురిని అరెస్ట్ చేసి, భారీగా నకిలీ సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. టాస్క్ఫోర్స్ డీసీపీ రాధాకిషన్రావు కథనం ప్రకారం.. అబిడ్స్లోని జగదీశ్ మార్కెట్లో భరత్ రామ్(జై రాజేశ్వర్ మొబైల్), పదాం సింగ్ (న్యూ కలెక్షన్ టార్గెట్ మొబైల్ షాప్), విస్రం పురోహిత్ అలియాస్ విశాల్ (పీఎస్ టెలికాం మొబైల్ యాక్సెసరీస్), హిమాయత్నగర్లో శివ వరప్రసాద్( ట్రింటీ మొబైలర్ ఇన్నోవేషన్లో సేల్స్ మెన్) వివిధ కంపెనీలకు చెందిన మొబైల్ యాక్ససరీస్ను ఈ దుకాణాలలో విక్రయిస్తున్నారు. యూఎస్బీ, బ్యాటరీ, గ్లాస్, అడాప్టర్, ఎయిర్ పాడ్, బ్యాటరీ ప్యాక్, ఇయర్ పాడ్ తదితర వస్తువులను వివిధ మార్గాలలో సేకరించి, వాటికి యాపిల్ లోగోలు, యాపిల్ బొమ్మలు అతికించి.. అసలైన యాపిల్ ఉత్పత్తులంటూ వినియోగదారులను నమ్మించి మోసం చేస్తున్నారు. సెంట్రల్ జోన్ టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ బి.రాజు నాయక్ బృందానికి వచ్చిన సమాచారంతో ఎస్సైలు సాయి కిరణ్, నవీన్కుమార్ తదితరులు ఆయా దుకాణాలపై దాడి చేసి, భారీ ఎత్తున నకిలీ వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. తదుపరి విచారణకు ఈ కేసులను అబిడ్స్, దోమలగూడ ఠాణాలకు టాస్క్ఫోర్స్ పోలీసులు అప్పగించారు.