సిటీబ్యూరో, అక్టోబర్ 2(నమస్తే తెలంగాణ): మద్యం తాగి వాహనాలు నడుపుతున్న వారి కిక్కు వదిలిస్తున్నారు పోలీసులు. ముమ్మరంగా డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తూ.. మందుబాబుల భరతం పడుతున్నారు. కోర్టులు సైతం కఠినంగా వ్యవహరిస్తున్నాయి. జైలు శిక్షలు, జరిమానాలు విధిస్తున్నాయి. ఈ ఏడాది ఎనిమిది నెలల్లో డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడ్డ వారికి సుమారు రూ. 6.6 కోట్ల జరిమానాలు విధించాయి.
గతంలో ఎక్కువ మొత్తంలో మద్యం సేవించిన వారికి ఎక్కువ శిక్షలు పడేవి. ప్రస్తుతం డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడ్డారంటే జరిమానా రూ. 10 వేలు, అంతకంటే ఎక్కువ మొత్తంలో కూడా చెల్లించాలంటూ… తీర్పులు వెలువడుతాయి. బ్రీత్ అనలైజర్తో పరీక్షలు నిర్వహించినప్పుడు బీఏసీ (బ్లడ్ అల్కాహాల్ కన్సట్రేషన్) మొతాదును బట్టి కేసులు నమోదు చేస్తారు. బీఏసీ కౌంట్ 30 కంటే ఎక్కువగా వచ్చిందంటే.. అలాంటి వారిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు నమోదవుతుంది. అనంతరం కోర్టులో చార్జ్జిషీట్ దాఖలు చేస్తారు. ఆ తరువాత పట్టుబడ్డ వ్యక్తి కౌన్సెలింగ్ పూర్తి చేసుకొని తప్పనిసరిగా కోర్టుకు హాజరుకావాల్సి ఉంటుంది. వారికి న్యాయస్థానం శిక్షలు ఖరారు చేస్తుంది. కొందరికి జరిమానాలు, మరికొందరికి జరిమానాలతో పాటు జైలు శిక్షలు కూడా పడుతుంటాయి.