సిటీబ్యూరో, డిసెంబర్ 25 (నమస్తే తెలంగాణ): మహానగరంలో మత్తు మాఫియాకు చెందిన 25మందిని టీన్యాబ్ పోలీసులు గుర్తించారు. అంతే కాకుండా గోవా కేంద్రంగా నగరానికి డ్రగ్స్ సరఫరా చేస్తున్న ప్రధాన సరఫరాదారుడు కింగ్పిన్ను సైతం టీన్యాబ్ పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు. అతడు ఇచ్చిన సమాచారం మేరకు నగరంలోని ఓ పబ్బులో డీజే ఆపరేటర్ సహా మొత్తం 25మంది డ్రగ్ సరఫరాదారులను గుర్తించినట్లు టీన్యాబ్ డైరెక్టర్ సందీప్ శాండిల్యా వెల్లడించారు. టీన్యాబ్ డైరెక్టర్ కథనం ప్రకారం… ఏపీలోని నెల్లూరు ప్రాంతానికి చెందిన ఆశిక్, డూడూ రాజేశ్ గోవాలో ఓ వ్యక్తి నుంచి 60 ఎస్టసీ అనే హార్డ్ డ్రగ్ను కొనుగోలు చేసి నగరానికి వచ్చారు. విశ్వసనీయ సమాచారంతో ఐదురోజుల క్రితం వారిని ఎస్ఆర్నగర్ పీఎస్ పరిధిలో అదుపులోకి తీసుకున్నారు.
వారి వద్ద నుంచి 34ఎస్టసీ మాత్రలను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు నిందితులను విచారించగా, గోవా నుంచి తీసుకువచ్చిన 66ఎస్టసీ డ్రగ్ మాత్రల్లో 32ఎస్టసీ మాత్రలను రేవ్ పార్టీకోసం సరఫరా చేసినట్లు వెల్లడించారు. అంతే కాకుండా గోవాలోని హనుమంత్బాబుసొ దివ్కర్ అలియాస్ బాబా అనే వ్యక్తి వద్ద నుంచి ఒక్కో ఎస్టసీ మాత్ర రూ.వెయ్యి నుంచి రూ.1200చొప్పున కొనుగోలు చేసినట్లు నిందితులు విచారణలో తెలిపారు. నిందితులు ఇచ్చిన సమాచారం మేరకు రేవ్పార్టీలో పాల్గొన్న మొత్తం 10మందిని అదుపులోకి తీసుకుని డ్రగ్ పరీక్షలు జరపగా అందులో ముగ్గురికి పాజిటివ్ వచ్చింది. ఈ ముగ్గురు వ్యక్తులకు సంబంధించిన మూత్ర నమూనాలను సేకరించి వైద్యపరీక్షలు జరిపించగా..12రకాల హార్డ్ డ్రగ్స్ను ఆ ముగ్గురు వ్యక్తులు తీసుకున్నట్లు తేలింది. దీంతో సదరు నిందితులను మేజిస్ట్రేట్ ముందు హాజరు పర్చడమే కాకుండా డీ ఎడిక్ట్ సెంటర్కు సైతం తరలించినట్లు టీన్యాబ్ డైరెక్టర్ వెల్లడించారు. అనంతరం స్థానిక పోలీసులతో పాటు వారి తల్లిదండ్రులు, వారు చదివే విద్యాసంస్థలకు సైతం సమాచారం అందించడంతో పాటు విషయాన్ని గోప్యంగా ఉంచాలని సూచించినట్లు వివరించారు. ఇటీవలే కొనుగోలు చేసిన ఈ పరికరంతో 400రకాల డ్రగ్స్ను గుర్తించవచ్చని వెల్లడించారు.