Director Krish | శేరిలింగంపల్లి, ఫిబ్రవరి 28: గచ్చిబౌలి రాడిసన్ బ్లూ డ్రగ్స్ పార్టీ కేసు విచారణ కొనసాగుతోంది. ఈ కేసులో వ్యాపార, సినీ ప్రముఖుల ప్రమేయం ఉండటంతో పోలీసులు జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. రాడిసన్ బ్లూ హోటల్లో నిర్వహించిన డ్రగ్స్ పార్టీలో మొత్తం 10 మంది పాల్గొన్నట్లు పోలీసులు కేసు నమోదు చేయగా.. ఇప్పటికి నలుగురిని అరెస్టు చేశారు. మిగిలిన వారి కోసం పోలీసు ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టారు. విచారణలో రాడిసన్ బ్లూ హోటల్లో గత కొన్ని రోజులుగా ప్రతి వారాంతంలో పార్టీలు జరిగేవని తెలిసింది. మరోవైపు దేశ, విదేశాలకు చెందిన ప్రముఖులు బస చేసే రాడిసన్ హోటల్లో సీసీ కెమెరాలు పనిచేయకపోవడం చర్చనీయాంశంగా మారింది.
ఫిబ్రవరి 25న గచ్చిబౌలి రాడిసన్ బ్లూ హోటల్లో డ్రగ్స్ పార్టీ జరుగుతున్నదని సమాచారం అందుకున్న పోలీసులు.. దాడులు చేసిన విషయం తెలిసిందే. ఈ దాడుల్లో డ్రగ్స్ వాడేందుకు ఉపయోగించిన సామగ్రిని పోలీసులు రాడిసన్ హోటల్లోని 1200, 1204 గదుల్లో నుంచి స్వాధీనం చేసుకున్నారు. ఈ పార్టీ నిర్వహించింది.. మంజీరా గ్రూప్ డైరెక్టర్, బీజీపీ నాయకుడు యోగానంద్ కుమారుడు గజ్జెల వివేకానంద్గా గుర్తించిన పోలీసులు అతడిని అరెస్టు చేశారు. మొత్తం 10 మంది కలిసి పార్టీ చేసుకోగా.. వివేకానంద్ ఇచ్చిన సమాచారంతో టాలీవుడ్ నిర్మాత కేదారినాథ్, వ్యాపారవేత్త నిర్భయ్ని కూడా పోలీసులు అదేరోజు అదుపులోకి తీసుకుని.. ముగ్గురికి వైద్య పరీక్షలు నిర్వహించారు.
పరీక్షల్లో ముగ్గురు కొకైన్ తీసుకున్నట్లు తేలడంతో.. ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. వీరికి కొకైన్ సరఫరా చేసిన హోటల్ మాజీ ఉద్యోగి సయ్యద్ అబ్బాస్ అలీ జాఫ్రీని మంగళవారం అరెస్టు చేశారు. కాగా, వీరితోపాటు పార్టీలో పాల్గొన్న టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు క్రిష్, నటి లిషీ గణేశా, యూట్యూబర్ శ్వేత, సందీప్, రఘుచరణ్, నీల్పై పోలీసులు కేసు నమోదు చేశారు. దర్శకుడు క్రిష్ విచారణకు వచ్చేందుకు రెండు రోజుల సమయం కోరినట్లు తెలిసింది. క్రిష్ మొదట శుక్రవారం విచారణకు వస్తానని చెప్పాడని, ప్రస్తుతం క్రిష్ ఫోన్ స్విచ్ఛాఫ్ వస్తుందని పోలీసులు చెబుతున్నారు. క్రిష్ ముంబైకి వెళ్లినట్లు పోలీసులు గుర్తించినట్లు సమాచారం. ఈ కేసులో మరో నిందితుడు రఘుచరణ్ మొదట తాను బెంగళూరులో ఉన్నానని, విచారణకు హాజరవుతానని పోలీసులకు తెలిపాడు. ప్రస్తుతం రఘుచరణ్ ఆచూకీ కూడా లభించడంలేదని తెలిసింది.