సిటీబ్యూరో, జనవరి 24 (నమస్తే తెలంగాణ): అనుమతులేమో ఆహార ఉత్పత్తుల తయారీకోసం తీసుకున్నారు. కాని అక్కడ తయారు చేసేవి మాత్రం నరాల వ్యాధిగ్రస్తుల చికిత్సకు వినియోగించే ఔషధాలు. కొంత కాలంగా నడుస్తున్న ఈ నకిలీ మందుల తయారీ రాకెట్ను డ్రగ్ కంట్రోల్ అధికారులు గుట్టు రట్టు చేశారు. డ్రగ్ కంట్రోల్ డీజీ కమలాసన్రెడ్డి కథనం ప్రకారం… హర్యానాలోని బార్హీలో ఆహార ఉత్పత్తుల తయారీ ముసుగులో అక్షర్ మాలిక్యూల్స్ అనే సంస్థ అక్రమంగా ఔషధాలను తయారు చేస్తోంది. ఈ క్రమంలో‘ఎన్యురాన్-పి’పేరుతో నరాల సమస్య చికిత్స కోసం వినియోగించే ‘ప్రెగబలిన్’ ‘మిథైల్కోబామిన్’ క్యాప్సిల్స్ తయారు చేస్తూ విక్రయిస్తున్నారు. ఈ విధంగా తయారు చేసిన ఔషధాలను సికింద్రాబాద్, తార్నాకలోని ఎలియాన్ హెల్త్కేర్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా మార్కెటింగ్ చేస్తున్నారు.
ఈ ఉత్పత్తిలో 75ఎంజీల ప్రెగబలిన్, 750ఎంసీజీల మిథైల్కోబామిన్ ఔషధాలను వినియోగించినట్లు డ్రగ్ కంట్రోల్ అథారిటీ అధికారులు నిర్ధారించారు. ఈ రకమైన ఔషధాలను డ్రగ్ కంట్రోల్ అథారిటీ అనుమతితోనే తయారు చేయాల్సి ఉండగా.. ఆహార ఉత్పత్తుల తయారీ కోసం తీసుకున్న అనుమతులతో తయారు చేయడం చట్టరీత్యా నేరమని డీసీఏ అధికారులు హెచ్చరించారు. అయితే గడిచిన నవంబర్లో ఈ నకిలీ ఔషధాలను కరీంనగర్లో డీసీఏ అధికారులు గుర్తించి, విక్రయదారులపై కేసులు నమోదు చేశారు. కేసు దర్యాప్తులో భాగంగా నిందితులు అందించిన సమాచారం మేరకు తాజాగా తార్నాకలోని ఎలియాన్ హెల్త్కేర్పై దాడులు చేశారు. రూ.93వేల విలువ చేసే నకిలీ ఔషధాలను సీజ్ చేసి, లాబొరేటరీకి తరలించారు.