సిటీబ్యూరో, జూలై 17 (నమస్తే తెలంగాణ): ఇక డ్రైవింగ్ లైసెన్స్ పొందడం అంత ఈజీ కాదు. ఉద్యోగం కోసం ఇంటర్వ్యూలకు ఎలాగైతే వెళ్తామో ఇక డ్రైవింగ్ లైసెన్స్ సాధించాలన్నా అంతటి శ్రమ పడాల్సిందే. ఔను ఇది నిజం. ఇటీవల కేంద్ర ప్రభుత్వం డ్రైవింగ్ శిక్షణను కఠినతరం చేస్తూ గెజిట్ను విడుదల చేసింది. తప్పనిసరిగా డ్రైవింగ్ స్కూల్లో శిక్షణ పొందడంతో పాటు వాహనం వివరాలు.. ఇంధన వినియోగం.. ప్రమాదం జరిగినప్పుడు చేయాల్సిన ఫస్ట్ ఎయిడ్, ట్రాఫిక్ రూల్స్, రోడ్డు నిబంధనలపై పట్టు ఉండాల్సిందేనని స్పష్టం చేసింది. రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర రవాణా శాఖ చేసిన ఈ గెజిట్పై కొందరు హర్షం వ్యక్తం చేస్తుండగా మరికొందరు పెదవి విరుస్తున్నారు.
కేంద్రం జారీ చేసిన మార్గదర్శకాలు అమల్లోకి వస్తే లైసెన్స్ పొందడానికి మరిన్ని కుస్తీపాట్లు ఎదుర్కోవాల్సిందే. థియరీ, ప్రాక్టికల్గా సిలబస్ను విభజించి కోర్సును రెడీ చేసింది. లైట్ మోటార్ వెహికిల్ డ్రైవింగ్ లైసెన్స్ కోసం 29 గంటల పాటు నాలుగు వారాలు శిక్షణ తీసుకోవాల్సి ఉంటుంది. ఇందులో థియరీని 8 గంటలుగా, ప్రాక్టికల్ కోసం 21 గంటలుగా విభజించింది.
థియరీ టాపిక్స్, ట్రాఫిక్ ఎడ్యుకేషన్, వెహికిల్ మెకానిజం, పబ్లిక్ రిలేషన్స్ అండ్ ఫస్ట్ ఎయిడ్, రోడ్ ఎక్విట్, రోడ్డు స్వరూపం, ప్రమాదాలకు కారణాలు, కేస్ స్టడీస్, ఇంధన సామర్థ్యం
ఏ వాహనానికి సంబంధించి డ్రైవింగ్ నేర్చుకుంటున్నామో ఆ వాహనం యొక్క పనితీరు నుంచి ఇంధన సామర్థ్యం వరకు శిక్షణలో తెలియజేస్తారు. నామమాత్రపు డ్రైవింగ్ టెస్ట్తో లైసెన్స్ పొందడానికి వీలు లేకుండా కేంద్రం ఇలాంటి నిబంధనలను తీసుకొచ్చింది. డ్రైవింగ్ ఇనిస్టిట్యూట్లో శిక్షణ తీసుకునే వారు కేవలం డ్రైవింగ్పైనే కాకుండా బ్రేక్స్, ఎక్స్లేటర్, హారన్, లైట్, డిప్పర్, ఇండికేటర్, స్టీరింగ్ కంట్రోల్, రోడ్ సెన్స్, పార్కింగ్, వాహన పొజిషన్, రివర్సింగ్, గేర్ చేంజ్, వేగం, లెఫ్ట్ టర్న్, రైట్ టర్న్, యూ టర్న్, ఎమర్జెన్సీ వెహికిల్స్, ఫైర్ ఇంజన్స్, అంబులెన్స్లకు దారి ఇవ్వడం తదితర ప్రతీ అంశాన్ని క్షుణ్ణంగా తెలుసుకోవాల్సి ఉంటుంది. అంతేకాదు ప్రమాద సమయంలో ప్రాథమిక చికిత్స ఎలా చేయాలో కూడా నేర్పిస్తారు. ట్రాఫిక్ ఎడ్యుకేషన్ ప్రధానంగా ఉండనుంది.
వాహనాలు పాడైతే మైనర్ రిపేరింగ్ ఎలా చేసుకోవాలో కూడా శిక్షణలో నేర్పిస్తారు. మొత్తంగా శిక్షణ ముగిసే సమయానికి వాహనంపై పూర్తి అవగాహన కల్పిస్తారు.
భారీ, అతి భారీ వాహనాల డ్రైవింగ్ లైసెన్స్ పొందాలంటే 6 వారాలకు గాను 38 గంటల సిలబస్ను రూపొందించారు. ఇందులో ప్రధానంగా ట్రాఫిక్, వెహికిల్ మెకానిజం, పొల్యూషన్ అండ్ ఎన్విరాన్మెంట్, హెచ్ఐవీపై అవగాహన, పొగాకు, ధూమపానం, మద్యం, మానసిక సమస్యలు, పబ్లిక్ రిలేషన్, ప్రమాద సమయంలో వాహనదారుల బాధ్యత తదితర అంశాలపై శిక్షణ ఇస్తారు. ప్రమాదం జరిగే స్థలాలను గుర్తించి.. వాటి వద్ద ఎలా డ్రైవ్ చేయాలో ప్రాక్టికల్గా నేర్పిస్తారు. ప్రమాదకర వస్తువులు తరలించే సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరిస్తారు.
గ్రేటర్లో సుమారు 2 నుంచి 3 వేల వరకు డ్రైవింగ్ స్కూళ్లు ఉన్నాయి. అందులో రిజిస్టర్ అయినవి వందల్లోనే ఉంటాయని సమాచారం. ఇప్పటి వరకు ఎవరైనా డ్రైవింగ్ నేర్చుకోవాలంటే డ్రైవింగ్ స్కూల్ వారిని సంప్రదించే వారు. రూ.3 వేల నుంచి 6 వేల వరకు ఫీజు చెల్లించి ఖాళీ రోడ్లు, గ్రౌండ్ల వద్ద శిక్షణ తీసుకునే వారు. అలా నేర్చుకున్నాక టెస్ట్కు హాజరై లైసెన్స్ పొందేవాళ్లు. అయితే కేంద్రం తీసుకొచ్చిన నూతన గెజిట్తో ఆ స్కూళ్ల భవిష్యత్ కనుమరుగు కానున్నది. ఎకరం, రెండు ఎకరాలు ఉంటేనే డ్రైవింగ్ స్కూల్కు అనుమతి లభించనున్నది. కేంద్ర ప్రభుత్వ నిబంధనలపై వాహన సంఘాలు భిన్నంగా స్పందిస్తున్నాయి. ప్రైవేట్ చేతుల్లోకి వెళ్లిపోతే వాహనదారులు ఆర్థికంగా నష్టపోవాల్సి ఉంటుందని.. అధిక ఫీజులు వసూలు చేస్తారని వాపోతున్నారు. మరికొందరు మాత్రం సమర్థిస్తున్నారు.
డ్రైవింగ్ తీసుకోవాలనుకునే వాహనదారులు కేంద్ర మార్గదర్శకాలకు అనుగుణంగా గుర్తింపు పొందిన డ్రైవింగ్ స్కూల్లో ప్రవేశం పొందాలి. ప్రతిరోజు శిక్షణకు హాజరవ్వాలి. ఇనిస్టిట్యూట్ నిర్వహించే పరీక్షలో కచ్చితంగా 85 శాతం ఉత్తీర్ణత సాధించాలి. లేకపోతే డ్రైవింగ్ టెస్ట్కు అనర్హుడిగా ప్రకటించి శిక్షణ పొడిగిస్తారు. ప్రాక్టికల్స్లో 60 శాతం మార్కులు పొందాలి. ఈ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన వారు ఆర్టీఏ అధికారుల వద్ద మళ్లీ టెస్ట్కు హాజరవ్వాలి. ఇలా థియరీ, ఆర్టీఏ అధికారులు నిర్వహించిన పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన వారికి లైసెన్స్ జారీ చేస్తారు.