సిటీబ్యూరో, డిసెంబర్ 2 (నమస్తే తెలంగాణ): గిట్టుబాటు కావడం లేదని క్యాబ్ డ్రైవర్లు..అధిక చార్జీలు భరించలేమంటున్న ప్రయాణికులు.. నిబంధనల మేరకే చెల్లిస్తామంటున్న క్యాబ్ సంస్థలు.. వెరసి గ్రేటర్లో నిత్యం ప్రయాణికులు నానాకష్టాలు పడుతున్నారు. ఫోన్లో నొక్కగానే ఇంటి వద్ద వాలిపోయే క్యాబ్లు ఇప్పుడు మొరాయిస్తున్నాయి. బుకింగ్ చేసిన నిమిషాల్లోనే రైడ్ (ప్రయాణం) రద్దవుతోంది. దీనిక్కారణం గిట్టుబాటు కావడం లేదని డ్రైవర్ల వాదన. కేంద్రం పెంచిన పెట్రోలు, డీజిల్ ధరలు భారంగా మారాయని, ఇప్పుడున్న చార్జీలు ఏ మాత్రం చాలడం లేదంటూ అకస్మాత్తుగా రైడ్లను రద్దు చేస్తుండడంతో ప్రయాణికులు రోడ్లపై నానా అగచాట్లు పడుతున్నారు.
ఆన్లైన్ పేమెంట్కు నో
ఆన్లైన్ పేమెంట్ను క్యాబ్ డ్రైవర్లు అంగీకరించడం లేదు. ముందు చెబితే రైడ్ను క్యాన్సిల్ చేస్తున్నారు. కారణం ఆ డబ్బులు నేరుగా కంపెనీల అకౌంట్కు వెళ్లడమే. 30 శాతం కమీషన్ కంపెనీ తీసుకొని, మిగిలిన డబ్బును డ్రైవర్ల ఖాతాలో జమ చేస్తారు. అది కూడా వారం నుంచి పదిరోజులు పడుతున్నది. దీంతో క్యాబ్, ఆటోడ్రైవర్లు ఆన్లైన్ పేమెంట్స్ను తిరస్కరిస్తున్నారు.
ఇంధన ధరల పెరుగుదల క్యాబ్ సర్వీస్లపై ప్రభావం చూపుతోంది. పెరిగిన ధరల కారణంగా క్యాబ్లను నడపలేని పరిస్థితి ఉందని డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. క్యాబ్ బుకింగ్ పూర్తయిన తర్వాత డ్రైవర్లు రైడ్ను రద్దు చేస్తుండటంతో ప్రయాణికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఆన్లైన్ పేమెంట్స్ కారణంతో కూడా ట్రిప్పును రద్దు చేస్తున్నారు. దీంతో కొంతకాలంగా ఓలా, ఊబర్ క్యాబ్ సర్వీస్లో అంతరాయం నెలకొంది. నిమిషాల వ్యవధిలో బుక్ కావాల్సిన ట్రిప్పు..అరగంట దాటినా సర్వీస్ కనెక్ట్ కావడం లేదని ప్రయాణికులు వాపోతున్నారు.
భరోసా లేని ప్రయాణం
గతంతో పోల్చితే క్యాబ్ల ప్రవేశం తర్వాత ప్రయాణికుల్లో భరోసా పెరిగింది. భద్రత ఉంటుందని వీటిల్లోనే ఎక్కువగా ప్రయాణిస్తున్నారు. కొంతకాలంగా క్యాబ్ సర్వీస్లు సజావుగా సాగకపోవడంతో కస్టమర్లు నష్టపోతున్నారు. ఇతర వాహనాల్లో ప్రయాణించడానికి భయపడుతున్నారు. ప్రధానంగా ఎయిర్పోర్టు నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లేవారు నిత్యం తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఓలా, ఊబర్ వాహనాల్లో జర్నీ సేఫ్గా ఉంటుందని.. ఇతర వాహనాల్లో కొంత భయంగానే ఉంటుందనేది ప్రయాణికులు మాట.
క్యాబ్లను ఆశ్రయించే పరిస్థితి లేదు
ఏ సమయంలోనైనా క్యాబ్ సర్వీస్ ఉంటుందనే నమ్మకం ఉండేది. ఎంత దూరమైన వెళ్లి రావచ్చు అని భావించాం. ఇప్పుడు క్యాబ్ సర్వీస్ బుక్ చేయడానికి అరగంటకుపైగా పడుతుంది. తీరా క్యాబ్ బుక్ అయ్యాక రైడ్ క్యాన్సల్ అంటూ మెస్సేజ్ వస్తుంది. సమయం బాగా వృథా అవుతుంది.
-కార్తీక్, ఉద్యోగి
గిట్టుబాటు గాకనే ట్రిప్స్ రద్దు
ఓలా, ఊబర్ సంస్థలు డ్రైవర్లను పట్టించుకోవడం లేదు. పెరిగిన ఇంధన ధరలతో ట్రిప్పులు చేయడం కష్టంగా ఉంది. కస్టమర్లు క్యాబ్ బుక్ చేశాక ట్రిప్పు వివరాలు తెలుసుకొని రద్దు చేస్తున్నాం. కస్టమర్ వద్దకు వెళ్లి తిరిగి నిర్దేశిత ప్రాంతంలో డ్రాప్ చేయడానికి అయ్యే ధర క్యాబ్ సర్సీస్లో చూపించడం లేదు. చార్జీలు పెంచమని కంపెనీలకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదు.
-షేక్ సలావుద్దీన్, అధ్యక్షుడు, తెలంగాణ ఫోర్వీలర్స్ డ్రైవర్స్ అసోసియేషన్
‘సికింద్రాబాద్కు చెందిన రాకేశ్ బంజారాహిల్స్ వెళ్లడానికి క్యాబ్ బుక్ చేశాడు. బుకింగ్ స్వీకరించిన డ్రైవర్ నిమిషాల్లోనే దాన్ని తిరస్కరించాడు. మళ్లీ మరో బుకింగ్ యత్నించాడు. అది కూడా తిరస్కరణకు గురైంది. ఇంకోటి ప్రయత్నించగా బుక్ చేసుకున్న డ్రైవర్ ఫోన్ చేసి ఎక్కడికి వెళ్లాలి? ఎంత అమౌంట్ చూపిస్తుంది? అని రైడర్ను ఆరా తీశాడు. 120 రూపాయలు చూపిస్తుందని చెప్పగా వెంటనే బుకింగ్ రద్దు చేశాడు. అప్పటికే ఆలస్యం అవుతుండడంతో చేసేది లేక 350 రూపాయలతో వేరే వాహనంలో వెళ్లిపోయాడు రాకేశ్.
‘మల్కాజిగిరికి చెందిన సుచిత్ర ఎయిర్పోర్ట్కు క్యాబ్ బుక్ చేసింది. రూ.520 వచ్చింది. ఆ బుకింగ్ స్వీకరించిన క్యాబ్డ్రైవర్ కొన్ని నిమిషాల అనంతరం రద్దు చేశాడు. కారణమేందని సుశీల డ్రైవర్ను ఆరా తీయగా..‘మేడం..మీ లొకేషన్కు 4 కిలోమీటర్ల దూరంలో ఉన్నా. మీ దగ్గరికొచ్చి ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేసి తిరిగి ఖాళీ(డ్రైరైడ్)గా రావాల్సి ఉంటుంది. అక్కడ ఏదైనా బుకింగ్ వస్తదని ఉన్నా.. 4 గంటలు ఆగాలి. పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలతో గిట్టుబాటు కావడం లేదు. క్షమించండి మేడం’ అని ఫోన్ పెట్టేశాడు.