మల్లాపూర్ ( హైదరాబాద్ ) : చిన్నకులం, తక్కువజనం, పేదవాళ్లం అనే ఆత్మన్యూనత భావం వీడి బీసీలు ఆధునిక అభివృద్ధిని అందుకోవాలని రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ (BC Commission Chairman) డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్రావు పిలుపు ఇచ్చారు. దేశంలో ఎక్కడా లేని రీతిలో, తెలంగాణలో సంక్షేమ పథకాలు (Welfare Schemes) అమలవుతున్నాయని పేర్కొన్నారు.
గురువారం మల్లాపూర్ అంబేద్కర్ భవన్లో తెలంగాణ రాష్ట్ర వీరభద్రీయ సంఘం నూతన కార్యవర్గం పదవీ బాధ్యతల స్వీకరణలో ఆయన పాల్గొన్నారు. ప్రభుత్వ పథకాలను లబ్ధి పొందడంలో వెనుకబడ వద్దని కోరారు. వీరభద్రీయులతో సహా సంచార కులాలు, జాతులు సమిష్టిగా ఒకే వేదికగా ఏర్పడి హక్కుల సాధనకు కృషిచేయాలని సూచించారు. కుల సంఘాలు, కార్యవర్గాల ఏర్పాటుకు ఎన్నికలు నిర్వహించుకోవడం ప్రజాస్వామ్య హితమే అయినప్పటికీ, అవి సంఘాల ఐక్యతను దెబ్బతీసేవిగా ఉండరాదని సూచించారు.
అభిప్రాయభేదాలు ఉండవచ్చు . భావస్వేచ్ఛ ప్రకటన హక్కు కాగా అది జాతీయులకు నష్టం కలిగించేలా పరిణమించడం శ్రేయదాయకం కాదని అభిప్రాయపడ్డారు. విద్య ద్వారానే ఎంతటి ఉన్నతినైనా సాధించవచ్చని అన్నారు. మహాత్మాజ్యోతిబాఫులే రెసిడెన్షియల్ పాఠశాలలో (Residential Schools) తమ పిల్లలను చేర్పించాలని కోరారు. గొప్ప పౌరులుగా ఎదగడానికి తల్లిదండ్రులతో పాటు, సంఘాల ప్రతినిధులు కృషిచేయాలని సూచించారు. కార్యక్రమానికి సంఘం జాతీయ అధ్యక్షులు డాక్టర్ ఉపేందర్ కర్నే అధ్యక్షత వహించగా, కార్పొరేటర్ పన్నాల దేవేందర్రెడ్డి, వీరభద్రీయసంఘం రాష్ట్ర, జాతీయ నాయకులు చెవ్వపాండు, కర్నె శివకుమార్, పన్నాల నాగరాజు తదితరులు పాల్గొన్నారు.