కంటోన్మెంట్, ఆగస్టు 29: పేదల సొంతింటి కల నేరవేరనున్నది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న డబుల్ బెడ్రూం ఇండ్లు ఆ పేదలకు అందనున్నాయి. ఈ క్రమంలో కంటోన్మెంట్ బోర్డు పరిధిలోని రసూల్పురా సిల్వర్ కంపౌండ్లో 224 ఇండ్ల నిర్మాణం చేపట్టి.. 168 పూర్తి చేశారు. మరోవైపు మారేడ్పల్లిలో నిర్మించిన సుమారు 450 ఇండ్లు కూడా ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. గూడు లేని నిరుపేదలకు సొంతింటి కలను సాకారం చేసేందుకు తీసుకొచ్చిన డబుల్ బెడ్రూం ఇండ్ల పథకం త్వరలో అర్హులైన లబ్ధిదారులకు చేరువవుతున్నది. సిల్వర్ కంపౌండ్, మారేడ్పల్లిలో నిర్మించిన గృహాలు పూర్తవడంతో త్వరలోనే లబ్ధిదారులకు కేటాయించనున్నారు. ఇందు కోసం సంబంధిత శాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
సిల్వర్ కంపౌండ్లో 224 డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం చేపట్టి, 168 పూర్తి చేశారు. చిన్న చిన్న పనులు మినహాయిస్తే దాదాపు పూర్తయ్యాయి. రెండు పడకల గదులున్న ఈ ఇండ్లలో, వంటగది, అటాచ్ బాత్ రూమ్తో సుందరంగా నిర్మించారు. నగరంలో కనిపించే అపార్ట్మెంట్లకు ఏ మాత్రం తీసిపోకుండా డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మించారు. అంతర్గత రహదారులు, మురుగు కాల్వల నిర్మాణం చేపడుతున్నారు. రంగులతో సహా అన్ని పనులు పూర్తయ్యాయి. ప్రధానంగా విద్యుత్ సౌకర్యాలు పూర్తికాగా, త్వరలో తాగునీటి పైపులైన్ కనెక్షన్ పనులు కూడా పూర్తిచేసి ఇండ్లను ప్రభుత్వానికి అప్పగించేందుకు కాంట్రాక్టర్లు సిద్ధమవుతున్నారు. అదేవిధంగా మారేడ్పల్లిలో నిర్మించిన సుమారు 450 ఇండ్ల పనులు కూడా పూర్తయి, ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్నాయి.
కార్ఖానాలోని తన క్యాంపు కార్యాలయానికి వచ్చిన డబుల్ ఇండ్ల లబ్ధిదారులతో ఆదివారం ఎమ్మెల్యే సాయన్న మాట్లాడారు. ఇండ్లు లేని పేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు ప్రభుత్వం డబుల్ ఇండ్లు నిర్మించినట్లు లబ్ధిదారులకు తెలిపారు. సెప్టెంబర్ మొదటి వారంలో సిల్వర్ కంపౌండ్ ఇండ్లను ప్రారంభిస్తామన్నారు. అర్హులైన వారిని గుర్తిస్తున్న అధికారులు ఇందుకు సంబంధించిన నివేదికలు సిద్ధం చేస్తున్నారని ప్రజలకు సూచించారు.
ఇండ్లులేని పేదల సొంతింటి కల సహకారం కానున్నది. కంటోన్మెంట్లోని రసూల్పురా సిల్వర్ కంపౌండ్, మారేడ్పల్లిలో ఇండ్ల్ల నిర్మాణం దాదాపు కావడం సంతోషకరంగా ఉంది. డబుల్ బెడ్రూం ఇండ్లను అధికారులు త్వరలోనే లబ్ధిదారులకు కేటాయించనున్నారు. సెప్టెంబర్ మొదటి వారంలో సిల్వర్ కంపౌండ్, చివరి వారంలో మారేడ్పల్లిలోని ఇండ్లను అధికారికంగా ప్రారంభిస్తారు. అర్హుల జాబితాలో ఉన్న లబ్ధిదారులు సొంతింటిలోకి అడుగుపెట్టనున్నారు. ప్రతి పేదవాడు ఆత్మగౌరవంతో ఉండాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యం. లబ్ధిదారులు త్వరలోనే గృహ ప్రవేశాలు చేస్తారు. ఇది ఎంతో శుభ పరిణామం.- జి. సాయన్న, ఎమ్మెల్యే, సికింద్రాబాద్ కంటోన్మెంట్