Amala Akkineni | సిటీబ్యూరో, ఫిబ్రవరి 28 (నమస్తే తెలంగాణ) : కుక్కలను శత్రువులుగా చూడవద్దని, వాటిని ప్రేమ, కరుణతో చూడాలని బ్లూ క్రాస్ సొసైటీ ఆఫ్ హైదరాబాద్ నిర్వాహకురాలు అక్కినేని అమల విజ్ఞప్తి చేశారు. ఇటీవల అంబర్పేటలో వీధి కుక్కల దాడిలో బాలుడు ప్రదీప్ మృతి చెందడం విచారకరమైన ఘటన అని పేర్కొన్నారు.
మానవులు, కుక్కల మధ్య ఏండ్ల నాటి అనుబంధం ఉన్నదని, మనం వాటిని ప్రేమిస్తే మనల్ని పదిరెట్లు తిరిగి ప్రేమిస్తాయని చెప్పారు. వీధి కుక్కల పెరుగుదలకు ప్రధాన కారణం జంతు జనన నియంత్రణ చర్యలు లేకపోవడమే కారణమని పేర్కొన్నారు. కుక్కల పట్ల హింస, ద్వేషాన్ని పెంచుకునే బదులు జంతువుల భద్రత, వాటి శ్రేయస్సుకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. జంతు ప్రేమికురాలిగా, కార్యకర్తగా జంతు సంరక్షణకు నా జీవితాన్ని అంకితం చేశానని ఈ సందర్భంగా అమల స్పష్టం చేశారు.