లాక్డౌన్ కష్టకాలంలో నిరుపేదలు పడుతున్న ఇబ్బందులను చూసిన ఆ వ్యక్తులు.. ఏదో ఒక రకంగా సమాజానికి ఉపయోగపడే సేవలు అందించాలని నిర్ణయించుకున్నారు. అభాగ్యులకు తోచిన సాయం చేయాలనే సంకల్పంతో ‘డొనేట్ వస్ర్తా’ను ప్రారంభించారు. పాత దుస్తులను సేకరించి కొత్తగా మలిచి నిరుపేదలకు అందించడమే ఈ కార్యక్రమం ముఖ్యోద్దేశం. అందుకోసం సోషల్ మీడియాను వేదికగా చేసుకున్నారు. ఓ వైపు చార్టెడ్ అకౌంటెంట్లుగా విధులు నిర్వర్తిస్తూ.. మరోవైపు సామాజిక సేవలో చురుకుగా వ్యవహరిస్తూ ..అందరి ప్రశంసలందుకుంటున్నారు. వారే సుజిత్, కార్తీక్. ఇటీవలే ఐటీ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్ నుంచి ప్రత్యేక అభినందనలు అందుకున్నారు.
మరకలు లేకుండా..
గతేడాది డిసెంబర్లో ప్రారంభించిన డొనేట్ వస్ర్తాలో 30 మంది సభ్యులు ఉన్నారు. గ్రేటర్లో 20 సేకరణ కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీరు దాతల సమాచారాన్ని సేకరించేందుకు సామాజిక మాధ్యమాలను విరివిగా ఉపయోగిస్తారు. వాళ్ల థీమ్ను అర్థమయ్యేలా వివరించి.. వారి నుంచి స్పందన వచ్చేలా చేస్తారు. దాతల నుంచి సేకరించిన జీన్స్, షర్ట్లు, పంజాబీ డ్రెస్సులు, చీరలు, ప్యాంట్లను ఒక చోటుకు తీసుకొస్తారు. వాటిని కొత్త దుస్తులుగా మలిచేందుకు గచ్చిబౌలిలోని టంబుల్ ఫ్రాంచైజీతో ఒప్పందం చేసుకున్నారు. పాత దుస్తులను సైజుల వారీగా విభజించి వారికి అందిస్తారు. మొదటగా వాటిపై మరకలు ఉంటే..స్పాట్ ట్రీట్మెంట్ చేసి తొలగిస్తారు. చిరుగులు ఉంటే కుడుతారు. అనంతరం ఉతికి ఆరబెడుతారు. తర్వాత స్టీమ్ ఐరన్ చేసి డ్రెస్సుల వారీగా కవర్లో ప్యాక్ చేసి డొనేట్కు అందిస్తారు.
అవసరమైన వారికి..
అనాథాశ్రమాలు, ఓల్డేజ్హోంలు, నిరుపేద స్ట్రీట్ వెండర్స్, యాచకులకు ఈ దుస్తులను అందిస్తారు. ఇటీవల 15 వందల జతల డ్రెస్సులను వివిధ ప్రాంతాల్లో పంపిణీ చేశారు. సైజుల ఆధారంగా వాటి అవసరం ఎవరికైతే ఉంటుందో వారి సమాచారం ముందుగానే టీం సేకరిస్తుంది. అలా వాటిని అవసరమైన వారికి చేరవేసి వారిలో సంతోషాన్ని నింపుతున్నారు. ఇటీవల ప్రభుత్వ ఆస్పత్రుల పేషెంట్లకు సహాయకులుగా వచ్చిన వారికి దుస్తులను అందజేశారు. నగరానికి వచ్చి ఎక్కడుండాలో తెలియక రోడ్ల మీద బెంచీలపై పడుకున్న వారికి వస్ర్తాలను అందించారు.
ముందుకొస్తున్నారు..
సరైన దుస్తులు లేక చాలా మంది ఇబ్బందులు పడుతుంటారు. అలాంటి వారికి తోచిన సాయం చేయాలనే ఉద్దేశంతో డొనేట్ వస్ర్తాను ప్రారంభించాం. మాకు సేవలందించేందుకు చాలా మంది ముందుకొస్తున్నారు. – ఎస్.పి. కార్తీక్, ఫౌండర్
డొనేట్ వస్ర్తా.బాధగా అనిపించి …
లాక్డౌన్ కాలంలో నిరుపేదలు యాతనకు గురయ్యారు. కొందరు దుస్తులు సరిగా లేక అవస్థలు పడ్డారు. చాలా బాధగా అనిపించింది. అన్నదాన కార్యక్రమాలు విరివిగా జరిగాయి. ఇక రెండోది సరైన దుస్తులు అందించాలని భావించాను. అందుకోసమే డొనేట్ వస్ర్తాను ప్రారంభించాం. సేవలను రాష్ట్రమంతా విస్తరించే ఏర్పాట్లు చేస్తున్నాం. -సుజిత్, ఫౌండర్, డొనేట్ వస్ర్తా
అనాథాశ్రమాల్లో..
చాలా మంది సరైన దుస్తులు లేక చిరిగిన, మాసిన దుస్తులతో అభాగ్యులు నగరంలో కనిపిస్తుంటారు. అలాంటి వారికి మా డొనేట్ వస్త్రా సేవలు బాగా ఉపయోగపడుతాయి. ముఖ్యంగా నిరుపేద మహిళలు, యాచకులకు దుస్తులు అందించాం. అనాథాశ్రమాలు, రోడ్ల మీద జీవనం సాగించే మహిళలకు పంపిణీ చేస్తున్నాం. -శ్రావణి, సభ్యురాలు, డొనేట్ వస్ర్తా