మనిషి శరీరంలోఏదైనా ఆరోగ్య సమస్యలు తలెత్తితే వాటిని గుర్తించేందుకు వైద్యులు ఎండోస్కోపీ, ఎమ్ఆర్ఐ లాంటి పరీక్షలు చేస్తుంటారు. అదే ఒరవడిలో నగరవాసులకు మంచినీటిని సరఫరా చేసే పైపులైన్లలో సమస్యలు తలెత్తితే వాటిని గుర్తించేందుకు అత్యాధునిక టెక్నాలజీతో కూడిన పరికరాలను ఉపయోగిస్తున్నారు. జలమండలి డివిజన్ 6 పరిధిలో కలుషిత నీటి సరఫరాకు కారణాలు గుర్తించేందుకు ఇటీవల ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టిన అత్యాధునిక వాటర్ ఎండోస్కోపిక్ యంత్రం మంచి ఫలితాలు ఇస్తోంది. – బంజారాహిల్స్,ఫిబ్రవరి 5
బస్తీలల్లో ఉన్న నల్లాల్లో కలుషిత నీరు వస్తోంది.. కాలనీలోని కొన్ని ఇండ్లల్లో రంగుమారిన నీరు వస్తోంది అంటూ నిత్యం జలమండలి టోల్ఫ్రీ నెంబర్కు ఫిర్యాదులు వస్తుండేవి. దీంతో వినియోగదారుల వద్దనుంచి ఫిర్యాదులు అందుకున్న జలమండలి సిబ్బంది ఆయా ప్రాంతాల్లోని మంచినీటి పైపులైన్ల్లో ఎక్కడ కలుషిత నీరు కలుస్తోందనే విషయాన్ని గుర్తించేందుకు నానా తంటాలు పడాల్సి వస్తోంది.
భూగర్భంలో నుంచి వెళ్లే మంచినీటి లైన్లలో కలుషితనీరు ఎక్కడ కలుస్తుందని తెలుసుకునేందుకు ఇటీవల జలమండలి అత్యాధునిక కెమెరాలతో కూడిన వాటర్ ఎండోస్కోపిక్ పరికరాన్ని వినియోగిస్తోంది. సన్నని ప్లాస్టిక్ పైపులైన్తో పాటు వాటర్ ఫ్రూఫ్ హెచ్డీ కెమెరాను మంచినీటి లైన్లోకి పంపిస్తారు. మంచినీటి లైన్లోకి వెళ్లిన కెమెరాను మానిటర్కు కనెక్ట్ చేయడం ద్వారా లోపల ఎలాంటి పరిస్థితులు ఉన్నాయని గుర్తిస్తారు. సాఫీగా వెళ్తున్న మంచినీటి లైన్లోకి ఎక్కడ కలుషిత నీరు కలుస్తోందనే అంశాన్ని కచ్చితంగా నిర్ధ్దారిస్తుండడంతో నేరుగా అక్కడే తవ్వకాలు జరిపి సమస్యను తొలగించేందుకు అవకాశం ఏర్పడుతోంది. తద్వారా కలుషిత నీటి సరఫరా ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించేందుకు వీలు ఏర్పడుతుందని అధికారులు తెలిపారు. గతంలో ఒక కలుషిత నీటి సరఫరా కారణం గుర్తించేందుకు 5నుంచి 6చోట్ల తవ్విన ఘటనలు కూడా ఉన్నాయని, తాజాగా వచ్చిన టెక్నాలజీతో నేరుగా సమస్యలను గుర్తించవచ్చని జలమండలి అధికారులు తెలిపారు.
కలుషిత నీటి సరఫరాపై వచ్చే ఫిర్యాదులను పరిశీలించేందుకు క్షేత్రస్థాయి సిబ్బంది వెళ్లినప్పుడు సమస్యలు ఎదురయ్యేవి. మంచినీటి లైన్ లీక్ కావడంతో ఎక్కువ శాతం కలుషిత నీరు కలుస్తుంటుంది. అయితే ఎక్కడ లీకవుతుందనే విషయాన్ని గుర్తించడమే అసలు సమస్యగా ఉండేది. సమస్యను గుర్తించేందుకు రోజుల తరబడి వెతకాల్సి వచ్చేది. కొన్ని ప్రాంతాల్లో సీవరేజ్ లైన్లు, వరదనీటి కాలువలకు సమీపంలో నుంచి వెళ్లే మంచినీటి లైన్లలో తలెత్తే సమస్యలను కనుక్కోవడం కోసం చాలా ఇబ్బంది పడేవాళ్లు. ఇప్పుడు అందుబాటులోకి వచ్చిన అత్యాధునిక ఎండోస్కోపిక్ యంత్రం ద్వారా కచ్చితమైన ఫలితాలు వస్తున్నాయి. తక్కువ సమయంలో సమస్యలను గుర్తించడంతో పాటు మరమ్మతులు చేయగలుగుతున్నాం.
-హరిశంకర్. జీఎం (జలమండలి డివిజన్-6)