కరోనా మహమ్మారి పంజా విసురుతున్నది.తగ్గినట్టే తగ్గి మళ్లీ ప్రభావం చూపుతున్నది.
మొదట నిబంధనలు పాటించడంతో తగ్గినట్లు కనిపించినా, మనల్ని వెంటాడుతూనే ఉన్నది. మాస్కులేకుండా తిరగడం, భౌతికదూరం ఏ మాత్రం పాటించపోవడం, శానిటైజర్ పక్కన పారేయడంతో కేసుల సంఖ్య పెరుగుతున్నది. నియోజకవర్గంలో అధిక సంఖ్యలో కేసులు నమోదు కావడం భయాందోళన కలిగిస్తున్నది. మరోవైపు ప్రభుత్వ కార్యాలయాల్లో సైతం కరోనా పంజా విసురుతున్నది.
అంబర్పేట, జనవరి 18: కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం కరోనా టెస్టులు చేయడం కూడా పెంచింది. టెస్టులు చేయడమే కాకుండా టీకాలు వేయడాన్ని కూడా పెంచింది. కేసులు పెరుగుతున్నాయన్న భయంతో జనాలు జ్వరంగా ఉన్నా కరోనా పరీక్ష చేసుకునేందుకు క్యూ కడుతున్నారు. గతంలో కంటే టెస్టులు చేసుకునేందుకు రద్దీ పెరుగుతుంది. వంద మంది టెస్టులు చేసుకుంటే రెండు, మూడు కేసులు పాజిటివ్గా వచ్చేవి. ప్రస్తుతం వందమంది కరోనా టెస్టులు చేసుకుంటే దాదాపు 60 మందికి పాజిటివ్గా నమోదవుతుంది. అంబర్పేట నియోజకవర్గంలో కూడా పాజిటివ్ రేటు పెరుగుతున్నది. దీంతో భయాందోళనకు గురవుతున్న ప్రజలు టీకాలు తీసుకుంటున్నారు. 15 నుంచి 18 ఏండ్ల లోపు తమ పిల్లలను కేంద్రాలకు తీసుకెళ్లి టీకాలు ఇప్పిస్తున్నారు. ఒకవైపు టెస్టులు, మరోవైపు టీకాలతో కేంద్రాల వద్ద రద్దీ పెరుగుతోంది.
370మందికి పరీక్షలు 177మందికి పాజిటివ్
అంబర్పేట, జనవరి 18: నల్లకుంట ఫీవర్ దవాఖానలో మంగళవారం 370 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 177 మందికి పాజిటివ్ వచ్చినట్లు వైద్యులు తెలిపారు.
నిర్ధారణ పరీక్షలు.. వ్యాక్సినేషన్
నల్లకుంట ఫీవర్ దవాఖానలో ర్యాపిడ్, ఆర్టీపీసీఆర్ రెండు రకాల టెస్టులను చేస్తున్నారు. తిలక్నగర్ యూపీహెచ్సీ, హర్రాస్పెంట యూపీహెచ్సీ, అంబర్పేట స్విమ్మింగ్ పూల్ గ్రౌండ్లో కరోనా టెస్టులు చేస్తున్నారు. బాగ్ అంబర్పేట, తిలక్నగర్, ఆంధ్ర మహిళా సభ, అంబర్పేట ఎంసీహెచ్ ప్లే గ్రౌండ్, ఫీవర్ దవాఖాన, హర్రాస్పెంట యూపీహెచ్సీలలో కొవాగ్జిన్, కొవిషీల్డ్ రెండు రకాల మొదటి, రెండో డోసులను ఇస్తున్నారు. ఇప్పటి వరకు ఇంకా టీకాలు తీసుకోని వారికి కూడా ఇక్కడ టీకా వేస్తున్నారు. ఈ నెల పదో తేదీ నుంచి హెల్త్ వర్కర్లు, ఫ్రంట్లైన్ వారియర్స్, 60 ఏండ్లు నిండిన వారు, రెండో డోసు తీసుకోని 9 నెలలు పూర్తయిన వారికి బూస్టర్ డోస్ను కూడా ఇస్తున్నారు. అంటే కరోనా కేసులు పెరిగిన నేపథ్యంలో ప్రభుత్వం ఒకవైపు టెస్టులు పెంచుతూనే టీకాలను కూడా ఇస్తున్నది. ఇంకా టీకా తీసుకోని వారు ముందుకు వచ్చి వెంటనే టీకా వేయించుకోవాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు.
పోలీసులకు కరోనా పాజిటివ్
కాచిగూడ, జనవరి 18: కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కాచిగూడ పోలీస్స్టేషన్లో పనిచేస్తున్న పోలీస్ సిబ్బందికి అంబర్పేట పోలీస్ దవాఖానలో ఆరుగురికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. ముగ్గురికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు వైద్యులు తెలిపారు. ఇది వరకే 13మంది కాచిగూడ పోలీసులకు కరోనా వచ్చిన విషయం తెలిసిందే. అలాగే కాచిగూడ ట్రాఫిక్ పోలీస్స్టేషన్ సిబ్బందికి ఆరుగురికి మంగళవారం కరోనా వచ్చినట్లు వైద్యులు తెలిపారు.