హైదరాబాద్ : ప్రముఖ నృత్య కళాకారిణి, ఆంధ్ర నాట్య గురువు, పరిశోధకురాలు డాక్టర్ కే సువర్చలాదేవి(53) బుధవారం హఠాన్మరణం చెందారు. ఆకస్మాత్తుగా అనారోగ్యానికి గురికావడంతో ఆమెను బుధవారం ఉదయం హైదర్గూడలోని అపోలో ఆస్పత్రికి తరలించారు. చికిత్స అందిస్తున్న క్రమంలో ఆమె గుండెపోటుకు గురై మరణించారు. సువర్చలాదేవి మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించి, ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
డాక్టర్ సువర్చలాదేవి పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో రెండు దశాబ్దాలుగా ఆంధ్ర నాట్య గురువుగా, అసిస్టెంట్ ప్రొఫెసర్గా పని చేస్తున్నారు. సువర్చలాదేవి మృతి పట్ల యూనివర్సిటీ వీసీ టీ కిషన్ రావు, రిజిస్ట్రార్ భట్టు రమేశ్, లలిత కళాపీఠం పీఠాధిపతి డాక్టర్ కోట్ల హనుమంతరావు, నృత్య శాఖాధిపతి డాక్టర్ వనజ ఉదయ్ సంతాపం ప్రకటించారు.