శంషాబాద్ రూరల్, జూలై 8: ఆరేండ్ల చిన్నారిని గుర్తు తెలియని మహిళ కిడ్నాప్ చేసిన సంఘటన మంగళవారం శంషాబాద్ ఆర్జీఐఏ పోలీస్స్టేషన్ పరిధిలో కలకలం రేపింది. సీఐ బాలరాజు తెలిపిన ప్రకారం.. మహబూబ్నగర్ జిల్లా మిర్జిల్ మండలం కాచన్పల్లి గ్రామానికి చెందిన కె. లక్ష్మమ్మ భర్త రమేశ్ ఇద్దరు పిల్లలతో కలిసి నివాసముంటూ కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నది. తరచూ రైల్లో ప్రయాణిస్తూ శంషాబాద్ పట్టణంతోపాటు హైదరాబాద్ నగరానికి వచ్చి భిక్షాటన చేసేది.
అందులో భాగంగా ఈనెల 1వ తేదీన ఇద్దరు పిల్లలతో కలిసి శంషాబాద్కు వచ్చిన లక్ష్మమ్మ పట్టణంలోని కల్లు దుకాణంలోకి వెళ్లి కల్లు తాగుతుండగా, గుర్తు తెలియని మహిళ కూతురు కీర్తన(6)ను తీసుకొని వెళ్లిపోయింది. లక్ష్మమ్మ తేరుకొని బయటకు వచ్చి చూడగా.. చిన్నారి కనిపించలేదు. చుట్టు పక్కల వెతికినా ఫలితంలేకపోవడంతో ఆమె స్వగ్రామానికి వెళ్లి కుటుంబసభ్యుల సహకారంతో మంగళవారం శంషాబాద్ ఆర్జీఐఏ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. చిన్నారిని కిడ్నాప్ చేసిన మహిళ ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టామని, సీసీ ఫుటేజీ ఆధారంగా గుర్తు తెలియని మహిళ కల్లు దుకాణం నుంచి నేరుగా శంషాబాద్ బస్టాండ్కు చేరుకున్నట్లు ఫుటేజ్ లభించినట్లు తెలిపారు. ఆమెను త్వరలో పట్టుకుంటామని సీఐ చేపట్టారు.