తెలుగు తెరపై ‘ఒక్కడు’, ‘అర్జున్’, ‘రుద్రమదేవి’ వంటి భారీ చిత్రాలను రూపొందించిన దర్శకుడు గుణశేఖర్. ఆయన తెరకెక్కించిన పౌరాణిక నేపథ్య చిత్రం ‘శాకుంతలం’. మహాకవి కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలం అనే సంస్కృత నాటకం ఈ చిత్రానికి నేపథ్యంగా ఎంచుకున్నారు. దుష్యంతుడిగా దేవ్ మోహన్ కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని దిల్ రాజు సమర్పణలో నీలిమ గుణ నిర్మించారు. త్రీడీ ఫార్మేట్లో తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ నెల 14న విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర విశేషాలను తాజా ఇంటర్వ్యూలో తెలిపారు గుణశేఖర్.
ఆకట్టుకునే ప్రేమకథ
‘రుద్రమదేవి’ సినిమా తర్వాత హిరణ్య కశ్యప కథ మీద ఐదేండ్లు పనిచేశాను. సెట్స్ మీదకు వెళ్లే సమయంలో లాక్డౌన్ వచ్చింది. దాంతో ఆ కథను పక్కనపెట్టాం. అనంతరం ఒక ప్రేమకథను తెరకెక్కించాలనే ఆలోచన కలిగింది. పురాణాలు, ఇతిహాసాలు వెతికినప్పుడు అభిజ్ఞాన శాకుంతలం బాగా ఆకట్టుకుంది. ఆ ఇతివృత్తాన్ని సామాజికంగా మార్చి చేయడం ఎందుకు అలాగే తెరకెక్కించవచ్చు కదా అనిపించింది. అలా శాకుంతలం మొదలైంది. ఈ కథలో ప్రేమతో పాటు విలువలు ఉన్నాయి. శకుంతల అనగానే మనకు శృంగార నాయిక గుర్తుకువస్తుంది. కానీ ఆమె అంతర్గతంగా చాలా శక్తిమంతురాలు. అభిజ్ఞాన శాకుంతలంతో కాళిదాసు పాత్రలను మలిచిన తీరు నన్నెంతో ఆకట్టుకుంది.
నేటితరం అమ్మాయిలకు చేరువవుతుంది
ఆత్మాభిమానం కోసం రాజులు, రాజ్యాలను లెక్కచేయని యువతి శకుంతల. పెండ్లి కాకుండా తల్లి కావడం అనేది అప్పట్లో పెద్ద నేరం. అలాంటి పరిస్థితులను ఆమె ఎలా ఎదురొడ్డి నిలబడింది అనేది ఈ చిత్ర కథాంశం. సమంత మంచి నటి కాబట్టి ఈ పాత్రలో రొమాంటిక్ యాంగిల్కు ద్వితీయ ప్రాధాన్యతే ఇచ్చాను. నటన పరంగా ఎంత ఉత్తమంగా చూపించగలనో అనేది ఆలోచించాను. అలాగే సమంత పాత్రను రూపకల్పన చేశాను. ఆమె పాత్రకు తన నటనతో ప్రాణం పోసింది. ఇప్పటి అమ్మాయిలు అన్ని రంగాల్లో పోరాడుతూ తమ గుర్తింపు పొందుతున్నారు. అందుకే నేటితరం అమ్మాయిలకు శకుంతల కనెక్ట్ అవుతుంది.
మేకింగ్లో ఎన్నో సంఘర్షణలు
ప్రకృతి అందాలతో ముడిపడిన కథ ఇది. అడవులు, జంతువులు ప్రతీది యానిమేషన్లో క్రియేట్ చేయాలి. ఎందుకంటే శకుంతలకు జంతువులే స్నేహితులు. వాటన్నింటి కోసం సీజీ మీద ఆధారపడాల్సి వచ్చింది. ఈ చిత్రానికి సీజీ వర్క్ కోసం 14 స్టూడియోలతో కలిసి పనిచేశాం. కొన్ని సన్నివేశాల చిత్రీకరణ కోసం కశ్మీర్ వెళ్లాం. కానీ ఎక్కడ కెమెరా పెట్టుకున్నా..వెనక ఎలక్ట్రిక్ ఫోల్స్ వంటి ఆధునిక సౌకర్యాలు కనిపించాయి. అవేమీ లేకుండా చాలా దూరం వెళ్లి అక్కడి విజువల్స్ ఉపయోగించుకోవాల్సి వచ్చింది.
త్రీడీలో మర్చిపోలేని అనుభూతినిస్తుంది
‘శాకుంతలం’ సినిమాను త్రీడీలో మీ ముందుకు తీసుకొస్తున్నాం. త్రీడీలో మా సినిమా ప్రేక్షకులకు మర్చిపోలేని అనుభూతిని అందిస్తుంది. ఇటీవల హైదరాబాద్లో ప్రీమియర్ షో వేశాం. చూసిన వాళ్లంతా తమకు బాగా నచ్చిందని చెబుతున్నారు. మోహన్దేవ్ నటించిన దుష్యుంతుడి పాత్రలో అనేక ఛాయలుంటాయి. అతను సినిమా కోసం ఎంత సమయమైనా వెచ్చిస్తానన్నాడు. అలాగే కష్టపడ్డాడు. ఇక దుర్వాస ముని పాత్రలో మోహన్బాబు కనిపిస్తారు. ఆయనను తప్ప మరొకరిని ఈ పాత్ర కోసం ఊహించుకోలేను. ఈ పాత్రలో మీరు నటించకుంటే ఎవరిని తీసుకోవాలో కూడా మీరే చెప్పాలి అని అనడంతో మోహన్బాబు నటించేందుకు ముందుకొచ్చారు.