రవీంద్రభారతి, ఆగస్టు 9: రాష్ట్రంలో నిర్వహిస్తున్న స్వతంత్ర భారత వజ్రోత్సవాలకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు రావాలని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ ఆకాంక్షించారు. భాషా సాంస్కృతికశాఖ ఆధ్వర్యంలో వజ్రోత్సవాలను మంగళవారం రవీంద్రభారతిలో మంత్రి వీ శ్రీనివాస్గౌడ్, వజ్రోత్సవాల కమిటీ చైర్మన్, టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు ప్రారంభించారు.
ఈ సందర్భంగా శ్రీనివాస్గౌడ్ మాట్లాడుతూ.. దేశ స్వాతంత్య్ర పోరాటంలో ఎందరో మహనీయులు ప్రాణత్యాగాలు చేశారని గుర్తుచేశారు. ఆ నాటి ఉద్యమ స్ఫూర్తితోనే తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం కొనసాగిందని చెప్పారు. స్వాతంత్య్ర ఉద్యమకాలం నాటి సంకల్పం నెరవేరే విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణను అభివృద్ధి చేస్తున్నారని కొనియాడారు.
కేశవరావు మాట్లాడుతూ.. స్వాతంత్రోద్యమ ఆశయాలు నెరవేరిననాడే అసలైన స్వాతంత్య్రం వచ్చినట్టని పేర్కొన్నారు. దేశ ప్రజలు భిన్నత్వం లో ఏకత్వాన్ని కోరుకొంటుంటే భిన్నత్వమే మా తత్వం అనే విధంగా కేంద్రం వ్యవహరిస్తుండటం బాధాకరమని చెప్పారు. కార్యక్రమంలో తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరి గౌరీశంకర్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ అయాచితం శ్రీధర్, పద్మశ్రీ అవార్డు గ్రహీత కనకరాజు, సాంస్కృతిక శాఖ సంచాలకుడు మామి డి హరికృష్ణ పాల్గొన్నారు. అనంతరం కనకరాజును శాలువాతో ఘనంగా సత్కరించారు.