సిటీబ్యూరో, ఆగస్టు 17 (నమస్తే తెలంగాణ): సైబర్ నేరం జరిగిన వెంటనే 100కు డయల్ చేస్తే ఈ సమాచారాన్ని నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ 155260కు బదిలీ చేస్తున్నారు అధికారులు. దీంతో సైబర్నేరగాళ్ల వలలో చిక్కుకున్న బాధితులకు కొంత ఊరట లభించనున్నది. ముఖ్యంగా సైబర్ నేరగాళ్లు ఇతర రాష్ర్టాల్లో ఉండి మోసాలకు పాల్పడుతుంటారు. దీంతో కేంద్ర ప్రభుత్వం నేషనల్ సైబర్ క్రైం రిపోర్టింగ్ పోర్టల్ను అందుబాటులోకి తెచ్చింది. హెల్ప్లైన్ నంబర్ ద్వారా సైబర్ నేరాల వివరాలను ఇతర రాష్ర్టాలకు చేరవేస్తుంది. ఫలానా బ్యాంక్ ఖాతా నుంచి నగదు బదిలీ అయ్యిందంటూ వాటిని నిలిపివేయాలంటూ మెసేజ్లు పంపిస్తుంది. దీంతో 155260ను హైదరాబాద్ పోలీసులు విస్తృతంగా ప్రజల్లోకి తీసుకు వెళ్తున్నారు. అంతేకాక సైబర్ ఫిర్యాదులు రాగానే వెంటనే ఈ పోర్టల్లో ఎంట్రీ చేస్తున్నారు. దీంతో బాధితులు పోగొట్టుకున్న నగదు సైబర్ నేరగాళ్ల చేతిలోకి వెళ్లకుండా ఆపగలుగుతున్నారు.