మధుమేహం బారినపడి పాద (ఫుట్) సంబంధిత సమస్యలతో తీవ్రంగా ఇబ్బందిపడుతున్న వారికి ఉస్మానియా ప్రభుత్వ దవాఖానలో అధునాతన క్లినిక్ అందుబాటులోకి వచ్చింది. ‘డయాబెటిక్ ఫుట్కేర్ క్లినిక్’ పేరుతో ప్రత్యేక కేంద్రాన్ని గురువారం ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నాగేందర్, ఉస్మానియా వైద్యకళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ శశికళ ప్రారంభించారు. మధుమేహ వ్యాధిగ్రస్తులు కొందరు ఫుట్ అలర్జీ, పక్షవాతం, ఆపిటేషన్ తదితర సమస్యలతో బాధపడుతుంటారు. వీరు దవాఖానలో ఆయా విభాగాలు తిరిగి వైద్యం చేయించుకోవడం ప్రయా స అవుతుండడంతో అన్ని సేవలు ఒకేచోట అందించేందుకు ఈ కొత్త క్లినిక్ను ఏర్పాటు చేశారు. ఉస్మానియా అవుట్ పేషెంట్ (ఓపీ) విభాగానికి నిత్యం 100 నుంచి 200 మంది మధుమేహ రోగులు వస్తుండగా, ఇందులో 15 నుంచి 20 కేసులు కేవలం పాద సంబంధిత సమస్యలతో వస్తున్నారు. రోగి ఒకసారి ఈ క్లినిక్కు వస్తే ఆరోగ్యపరిస్థితి ఆధారంగా అన్ని విభాగాల వైద్యులు అవసరమైన చికి త్స అందిస్తారు. నిర్ధారణ పరీక్షలు కూడా ఇక్కడే నిర్వహిస్తారు.
సిటీబ్యూరో, మే 5 (నమస్తే తెలంగాణ) : మధుమేహ కాలితో సమస్యలు ఎదుర్కొంటున్న రోగులకు మరింత మెరుగైన వైద్యం అందించేందుకు ఉస్మానియా వైద్యులు ప్రత్యేకంగా ‘డయాబెటిక్ ఫుట్ కేర్ క్లినిక్’ను అందుబాటులోకి తీసుకువచ్చారు. దవాఖాన ఆవరణలో నూతనంగా ఏర్పాటు చేసిన సెంటర్ను బుధవారం దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ బి.నాగేందర్, ఉస్మానియా వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ శశికళ, డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ త్రివేణి, ఎండోక్రనాలజి విభాగాధిపతి డాక్టర్ రాకేశ్సాహెతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా సూపరింటెండెంట్ డాక్టర్ నాగేందర్ మాట్లాడుతూ ప్రస్తుతం డయాబెటిక్ రోగుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నదని, వీరికి ఒకే చోట అన్ని వైద్య సేవలు అందించేందుకు ప్రత్యేకంగా మల్టీస్పెషాలిటీ డయాబెటిక్ ఫుట్ కేర్ క్లినిక్ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. డయాబెటిక్ ఫుట్ రోగులకు అవసరమైన న్యూరోపతి, డాప్లర్ స్టడీ తదితర అన్ని రకాల వైద్యసేవలను ఇక్కడే నిర్వహించనున్నట్లు చెప్పారు.
రోజుకు 15నుంచి 20 కేసులు
ప్రతిరోజు 100 నుంచి 200మంది డయాబెటిక్ రోగులు ఓపీ సేవల కోసం దవాఖానకు వస్తుండగా అందులో 15నుంచి 20కేసులు కేవలం డయాబెటిక్ ఫుట్ సమస్యతో వస్తున్నట్లు ఎండోక్రనాలజి విభాగాధిపతి డాక్టర్ రాకేశ్సాహె తెలిపారు. వీరిలో 30-40శాతం మంది న్యూరోపతి సమస్యతో (పాదంలో స్పర్శ లేకపోవడం) బాధపడుతున్నట్లు చెప్పారు. ఈ సమస్యతో బాధపడే రోగులు నడిచేటప్పుడు కాలికి ఏదైనా గుచ్చుకున్నా తెలియదని, అది ఇన్ఫెక్షన్కు లేదా అలర్జీకి గురై కాలు కొట్టేసే పరిస్థితి వస్తుందన్నారు.
అన్ని సేవలు ఒకే చోట
సాధారణంగా డయాబెటిక్ రోగులకు వివిధ రకాల సమస్యలు ఏర్పడతాయి. సాధారణంగా డయాబెటిక్ మేనేజ్మెంట్తో పాటు ఆర్థో, న్యూరో, సర్జన్, కార్డియో తదితర విభాగాలకు సంబంధించిన వైద్యులు అవసరం. ఇందుకోసం రోగి ఒక్కో విభాగానికి తిరగాలంటే చాలా రోజుల సమయం పడుతుంది. ఆ లోపు ఉన్న జబ్బు మరింత ముదరడమే కాకుండా రోగికి సైతం తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయి. దీన్ని అధిగమించేందుకు ఉస్మానియా వైద్యులు డయాబెటిక్ ఫుట్ కేర్ క్లినిక్లోనే సర్జన్, డయాబెటిక్ మేనేజ్మెంట్, న్యూరో, ఆర్థో, కార్డియో తదితర అన్ని రకాల ప్రధాన విభాగాలకు సంబంధించిన వైద్యులను అందుబాటులో ఉంచారు. రోగి ఒక్కసారి ఈ క్లినిక్కు వస్తే అతడి ఆరోగ్యపరిస్థితి ఆధారంగా అవసరమైన విభాగాల వైద్యులందరు అక్కడికే వచ్చి రోగికి అవసరమైన చికిత్స అందిస్తారని వైద్యులు తెలిపారు.